లోకసభ ఎన్నికల్లో దేశంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే: కేటీఆర్ జోస్యం, ప్రధాని పదవిపై కవిత
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం అనంతరం తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాదు నగర పరిధిలోని కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన విజయోత్సవ సభలో మాట్లాడారు. వచ్చే 2019 లోకసభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాల్లో 16 స్థానాలు తెరాస గెలుచుకుంటుందని చెప్పారు.
కేసీఆర్కు షాకింగ్: 'సంక్రాంతి తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుంది!'
యూపీఏకు 100, ఎన్డీయేకు 150 సీట్లు వచ్చే పరిస్థితి లేదు
ఈ సందర్భంగా 2019 లోకసభ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో జోస్యం చెప్పారు. మరో మూడు నాలుగు నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏకు 100 సీట్లు దాటే పరిస్థితి లేదని చెప్పారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేకు 150 సీట్లు కూడా రావని కేటీఆర్ చెప్పారు. వచ్చే లోకసభ ఎన్నికల అనంతరం బీజేపీ లేదా కాంగ్రెస్ కూటములు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
ప్రధానిని నిర్ణయించే శక్తి
ఈ కారణంగానే వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలను కూడగట్టే పనిలో తమ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిమగ్నమై ఉన్నారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలోని పదహారు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీని మనమే శాసించే పరిస్థితి వస్తుందని చెప్పారు. ప్రధాని అభ్యర్థిని కూడా నిర్ణయించే శక్తి వస్తుందన్నారు. అప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సకాలంలో, సక్రమంగా తెచ్చుకోవచ్చని తెలిపారు.
కేసీఆర్ ప్రధాని కావొచ్చు
కేసీఆర్ కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే కేసీఆర్ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశముందని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ మెజారిటీ సీట్లు సాధిస్తే కేసీఆర్ ప్రధాని అవుతారా అని యాంకర్ ప్రశ్నిస్తే.. దానికి కవిత స్పందిస్తూ.. అప్పటి పరిస్థితి, సందర్భాన్ని బట్టి ఎవరు ప్రధానిగా ఉండాలో నిర్ణయించుకుంటామని, ప్రధాని అయ్యేవాళ్లలో కేసీఆర్ కూడా ఉండే అవకాశముందని, ఆయన కూడా ప్రధాని కావొచ్చునని చెప్పారు.
సీఎంగా కేటీఆర్, కవిత వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రిగా మీ సోదరుడు కల్వకుంట్ల తారక రామారావు అవుతారా అని యాంకర్ ప్రశ్నిస్తే, దానికి కవిత స్పందిస్తూ... ఇంకా దానికి సమయం ఉందని, అప్పుడే తొందరేమీ లేదని, ఈ విషయాన్ని తమ అన్న కేటీఆర్ చాలాసార్లు చెప్పారని అన్నారు.