కాఫీ డేలో కూర్చోబెట్టి బెదిరించారు, వెనుక ఎవరున్నారు: కేసీఆర్పై ఉత్తమ్ కుమార్
నల్గొండ: 2019లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, తాము అధికారంలోకి వచ్చాక ఇష్టారీతిన వ్యవహరిస్తున్న అధికారులను, అధికార పార్టీ నేతలను ఎవరనీ వదిలే ప్రసక్తి లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం అన్నారు. నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యను నిరసిస్తూ కాంగ్రెస్ భారీ సభను నిర్వహించింది.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడారు. ఎలాంటి తప్పుడు పనులు చేయాలని పెద్దల నుంచి ఒత్తిడి వస్తే సీఐ వెంకటేశ్వర రావు కనిపించకుండా పోయారని ప్రశ్నించారు. ఎస్పీ శ్రీనివాస్ను వెంటనే ప్రభుత్వం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
శ్రీనివాస్ హత్య: 'కేసీఆర్ను అంటారా, కోమటిరెడ్డి పాములా పెంచారు, కాల్ లిస్ట్ ఇవ్వు'
తీవ్ర పరిణామాలని హెచ్చరిక
అధికార పార్టీ లేదా అధికార పార్టీ తొత్తులు కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే అంతు చూస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో సరైన చర్యలు లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటుందని కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ వస్తే అణగారిన వర్గాలకు, బీసీలు, దళితులు, మైనార్టీలకు మేలు జరుగుతుందని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. కానీ ఈ రోజు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్డ్ కుమ్మరి కులానికి చెందిన శ్రీనివాస్ను హత్య చేశారన్నారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ భర్త చనిపోతే జిల్లాకు చెందిన మంత్రికి కనీసం సంతాపం లేదా విచారం తెలపలేకపోయారని మండిపడ్డారు. ఈ కేసులో వారి పాత్ర ఉంది కాబట్టే సంతాపం తెలియజేయలేదని ఆరోపించారు. ఘటన జరిగిన రోజు రాత్రి బొడ్డుపల్లి శ్రీనివాస్కు ఫోన్ వస్తే బయటకు వెళ్లారని, అప్పుడు హత్యకు గురయ్యారని చెప్పారు.
కాఫీడేలో కూర్చోబెట్టి బెదిరించారు
నెల రెండు నెలల క్రితం నార్కట్పల్లి కాఫీడేలో కూర్చోబెట్టి ఎమ్మెల్యే వీరేశం.. బొడ్డుపల్లి శ్రీనివాస్ను కూర్చోబెట్టి తెరాసలో చేరాలని బెదిరించారని ఉత్తమ్ అన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోను చంపేస్తామని కూడా ఆయనకు బెదిరింపులు వచ్చాయని చెప్పారు. గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ కుటుంబాన్ని సీఎం వద్దకు తీసుకు వెళ్లి భద్రత కల్పించాలని కోరారని ఉత్తమ్ గుర్తు చేశారు. సీఎం నుంచి కలెక్టర్, పోలీసుల వరకు అందరికీ బొడ్డుపల్లి శ్రీనివాస్కు ప్రాణహానీ ఉన్నట్లు ఫిర్యాదు చేశారన్నారు. భద్రతను కల్పించలేకుంటే గన్ లైసెన్స్ ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్నారని చెప్పారు. కానీ గన్ లైసెన్స్ తిరస్కరించి ముఖ్యమంత్రి ఈ హత్యకు కారణం కాదా అని యావత్ తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు.
కాల్ డేటాతో ఎందుకు విచారణ జరపడం లేదు, ఎవరున్నారు?
హత్య జరిగాక కాల్ డేటా తీయాలని తాము అందరినీ కోరామని ఉత్తమ్ చెప్పారు. కాల్ డేటా తీస్తే హత్యలో ఎవరి ప్రమేయం ఉందో తేలుతుందని చెప్పామన్నారు. కానీ ఆ తర్వాత మూడు రోజులకు పోలీసు అధికారి మీడియా సమావేశం పెట్టి మిర్చి బండి వద్ద ఉల్లిగడ్డ కోసం పంచాయతీ జరిగిందని తప్పుడు కథనాలు అల్లారన్నారు. అందరి ఫోన్లు ట్రాప్ చేస్తున్న ఈ ప్రభుత్వం కాల్ డేటాతో ఎందుకు విచారణ జరపడం లేదన్నారు. నిజాలు బయటకు రావడం లేదని కేసీఆర్ కోరుకుంటున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కేసును తప్పుదారి పట్టించే అవసరాలు, అవకాశం ఎవరికి ఉందో చెప్పాలని నిలదీశారు. పోలీసులు కేసును నీరు గార్చారన్నారు. కేసు దర్యాఫ్తును సీబీఐకి అప్పగించాలన్నారు.
ఐదు రోజుల్లో బెయిల్ వచ్చిందంటే ఎవరు ఉన్నారు
హత్య కేసులో ఐదు రోజుల్లో బెయిల్ వచ్చిందని, ఇలా ఎప్పుడైనా జరిగిందా అని ఉత్తమ్ ప్రశ్నించారు. ఈ కేసును ఎవరు ప్రభావితం చేస్తున్నారో చెప్పాలన్నారు. నిందితులకు ఐదు రోజుల్లో బెయిల్ వచ్చిందంటే వారి వెనుక ఎవరు ఉన్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్ పాలనలో నేరెళ్లలో దళితులను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చిత్రవధ గురి చేస్తారని, తాడ్వాయిలో గిరిజనులను చెట్లకు కట్టివేసి కొడతారని మండిపడ్డారు. మరోచోట గిరిజనుడికి కాళ్లకు, చేతులకు బేడీలు వేసి చిత్రవధ చేస్తారన్నారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణలో అందరికీ ఎలా అన్యాయం జరుగుతుందో భారత రాష్ట్రపతికి తెలియజేస్తామన్నారు.