ఈవీయం ల టాంపరింగ్ పై డెమో చూపిస్తామంటున్న కాంగ్రెస్..!గాంధీ భవన్ లో నేతల కసరత్తు..!!
Recommended Video
హైదరాబాద్ : ఊహించిని విజయం ఎంత మధురంగా ఉంటుందో ఊహించని ఓటమి అంత విషాదంగా ఉంటుందని తెలంగాణ ఎన్నికలు రుజువు చేసాయి. చంద్రశేఖర్ రావును ఎదిరించాలని కూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ కి అనూహ్య పరాజయం వెంటాడింది. దీంతో హేమాహేమీల్లాంటి నేతలు కూడా గులాబీ పార్టీ సునామీ ముందు నిలవలేక పోయారు. ప్రజా వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపించిన టీఆర్ఎస్ పార్టీకి ఇంతటి మెజారిటీ ఎలా సాద్యమైందని కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు జరుపుతోంది. అసలు ఈవీయం యంత్రాల్లో సాంకేతిక లోపంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో అదికారులు గులాబీ పార్టీకి అనుకూలంగా పనిచేసారని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. ఇదే అంశాన్ని నిర్దారించేందుకు కసరత్తు కూడా చేస్తోంది.
ఎన్నికల్లో అవతకతవకలు జరిగాయి..! ఈవియంలు టాంపర్ చేసారంటున్న కాంగ్రెస్..!
తెలంగాణలో కేసీఆర్కు అసాధారణమైన ఫలితాలు రావడం, గులాబీ అభ్యర్థులకు ఊహించని మెజారిటీ రావడం వెనుక అనేక అనుమానాలను వ్యక్తంచేస్తోంది కాంగ్రెస్ పార్టీ. దీనిని ఇలాగే వదిలేస్తే భవిశ్యత్తులో మరింత నష్టపోతామన్నది కాంగ్రెస్ ఆలోచన. అందుకే పోలింగ్ సరళిలో జరిగిన అవకతవకలను బహిర్గతం చేయకపోతే రాబోవు రోజుల్లో పెను ప్రమాదం పొంచి ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. పోలింగ్ బూత్ లలో ఏం జరిగింది., ఈవీయంలు ఎలా పని చేసాయి అనే అంశాల పట్ల సునిశిత సమాలోచనలు జరుపుతోంది కాంగ్రెస్ పార్టీ.
గాంధీ భవన్ లో ముఖ్యనేతల సమావేశం..! ఎన్నికల సరళి పై సమీక్ష..!!
ప్రజాకూటమి ఓటమిపై కాంగ్రెస్ నేతలు మేథోమదనం నిర్వహిస్తున్నారు. ఓటింగ్ శాతం, లెక్కింపుల్లో తేడాలు ముఖ్య అజెండాగా జరిగిన ఈ మీటింగ్ కు హైదరాబాద్ లోని గాంధీభవన్ వేదికయ్యింది. దీనికి టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, డీకే అరుణ వీహెచ్ తదితర కాంగ్రెస్ సీనియర్లు హాజరయ్యారు. ఎన్నికల్లో జరిగిన కొన్ని అనుమానాస్పద ఘటనలపై కోర్టుకు వెళ్లాలని వారు నిర్ణయించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ కచ్చితంగా జరిగిందన్నది కాంగ్రెస్ అనుమానం. అందుకే దీనిపై న్యాయపోరాటం చేయాలని రాష్ట్ర పార్టీ శాఖ నిర్ణయించింది.
ఈసీ పారదర్శకంగా వ్యవహరించ లేదు..! వాస్తవాలు నిరూపిస్తామంటున్న కాంగ్రెస్..!!
ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ అధికారులపై కాంగ్రెస్ నేతలు పలు ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పదవీ విరమణ పొందిన అధికారులను ఎన్నికల సంఘంలో కొనసాగేలా ప్లాన్ చేసిందని వారు ఆరోపించారు. 20 లక్షల ఓట్లు తొలగించడం అనేది చాలా తీవ్రమైన నేరమని, తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ వైఖరిపై వారు అనుమానాలు వ్యక్తంచేశారు. లోపాలను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరిస్తామని, ఎన్నికల పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం 5 గంటల తర్వాత పోలీసులు, పోలింగ్ అధికారులు కుమ్మక్కై రిగ్గింగ్ చేశారని వారు ఆరోపించారు. అందుకు కొన్ని రుజువువలను కూడా కాంగ్రెస్ పార్టీ సిద్దం చేసినట్టు తెలుస్తోంది.
యంత్రాంగం, యంత్రాలు ఏకమయ్యాయి..! కుట్రను ఛేదిస్తామంటున్న టీపిసిసి..!
నర్సాపూర్ నియోజకవర్గంలో సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ శాతం 70. కానీ క్యూలో అప్పటివరకు ఉన్న వాళ్లు వేసినా అది ఐదు లేదా ఆరు శాతం పెరగాలి. చరిత్ర మొత్తం ఇదే చెబుతుంది. కానీ అక్కడ పోలింగ్ ఒక గంటలోనే 90 శాతానికి ఎలా పెరిగింది? అన్నది వారి అనుమానం. చిప్ లు పెట్టి మరీ ట్యాంపరింగ్ చేశారని, దీనిని అధ్యయనం చేశామని మీడియాకు వెల్లడించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పై త్వరలో డెమో చూపిస్తామని ముఖ్య నేతలు చెప్పారు. జరిగిన అవతవకలను నిరూపించి కొన్ని నియోజక వర్గాల్లో రీపోలింగ్ నిర్వహించాలన్నది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశంగా తెలుస్తోంది.