కోమటి రెడ్డి పై కాంగ్రెస్ క్రమశిక్షణా చర్యలు..!అంతకన్నా ముందే రాజీనామా యోచనలో రాజగోపాల్..!!
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిపై ఆ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా తయారైందన్నారు. పార్టీ అధిష్ఠానం తప్పుడు నిర్ణయాల వల్లే రాష్ట్రంలో పార్టీకి ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకొనే అవకాశం లేదన్నారు. భవిష్యత్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ఆయన వ్యాఖ్యానించారు.
దేశమంతా బీజేపీ వైపే చూస్తోందని..పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చనందుకే కాంగ్రెస్ ఓటమిపాలైందని ఆరోపించారు. బీజేపీలో చేరడంపై కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా లాభంలేదన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా పట్టించుకునే పరిస్థితి లేదంటూ పార్టీపైనా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియాపైనా ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమంటూ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో పార్టీ క్రమశిక్షణ సంఘం కోమటిరెడ్డికి త్వరలోనే షోకాజ్ నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న రాజగోపాల్ మరో అడుగు ముందుకు వేసి ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచేశారు. చంద్రశేఖర్చ రావు కుటుంబ పాలనను అడ్డుకోవాంటే బీజేపీతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. మోదీ సాహసోపేత నిర్ణయాల వల్ల అన్ని రంగాల్లో దేశానికి గుర్తింపు లభించిందని, అందుకే ప్రజలు ఆ పార్టీకి మరోసారి పట్టం కట్టారని ఇటీవల కోమటిరెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని, రానున్న రోజుల్లో మరింత అధ్వానంగా మారే అవకాశం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ నాయకత్వం తప్పిదాలే ఈ దుస్థితికి కారణమంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలన్నింటినీ అధిష్ఠానం సీరియస్గా తీసుకుంది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తప్పవని భావిస్తున్నారు. అయితే ఆదివారం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి దిల్లీ వెళ్తున్నారు. తిరిగి రాగానే ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.