నగేశ్పై చర్యలకు రంగం సిద్ధం : అత్యవసరంగా క్రమశిక్షణ కమిటీ భేటీ
హైదరాబాద్ : అఖిలపక్ష సమావేశంలో వీహెచ్ పై అనుచితంగా ప్రవర్తించిన నగేష్ ముదిరాజ్ పై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకోనుంది. సమావేశంలో వీహెచ్ పై నగేశ్ దాడిచేసినట్టు కమిటీ భావిస్తోంది. ఈ ఇష్యూపై క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు అత్యవసరంగా సమావేశమయ్యారు.
దురుసు ప్రవర్తన ..
ఇందిరా పార్క్ వద్ద అఖిలపక్షం సమావేశమైంది. ఇంటర్ బోర్డు అవకతవకలపై నిరసన తెలిపేందుకు నేతలు ఆశీనులయ్యారు. ఇంతలో నగేశ్ ముదిరాజ్ .. వీహెచ్ పై దురుసుగా ప్రవర్తించారు. దీంతోపాటు ఏఐసీసీ ఇంచార్జీ కార్యదర్శి కుంతియా సభలో వీహెచ్ పై దాడికి దిగారు. సీనియర్ నేత వీహెచ్ పై నగేశ్ అనుచితంగా పవర్తించి .. దాడికి దిగడాన్ని క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది.
ఉపేక్షించం ..
పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదని కమిటీ తేల్చిచెప్పింది. ఈ అంశంపైనా అక్కడ సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, మండలి విపక్ష మాజీ నేత షబ్బీర్ అలీను కమిటీకి నివేదిక ఇవ్వాలని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా సూచించారు.
చర్యలు తప్పవు ..
ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం, వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా నగేష్ ముదిరాజ్పైన చర్యలు తీసుకునేందుకు క్రమశిక్షణా సంఘం రంగం సిద్ధం చేసింది. క్రమశిక్షణ విషయంలో ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించింది.