ద్రౌపది కార్టూన్ పై బీజేపీ సూటి ప్రశ్న: కాంగ్రెస్ చర్యను ఒక మహిళగా ప్రియాంకాగాంధీ సమర్థిస్తుందా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ.. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ దగ్గర ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికలను అపహాస్యం చేశారంటూ మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహారణతో పోల్చుతూ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపిన నేపథ్యంలో బీజేపీ నాయకులు ఎదురుదాడికి దిగారు.
కాంగ్రెస్ చర్యను ప్రియాంకా గాంధీ సమర్థిస్తుందా..?
కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపిన విధానం సరిగ్గా లేదంటూ ఆరోపిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. మహిళ అయిన ద్రౌపది బొమ్మతో కాంగ్రెస్ వారు నిరసన తెలిపి మహిళల మనోభావాలను దెబ్బతినేలా వ్యవహరించారని చెప్పిన బీజేపీ నేత కృష్ణసాగర్ రావు... ఒక మహిళ అయిన ప్రియాంకా గాంధీ వాద్ర ఈ చర్యను ఆమోదిస్తుందా అంటూ ప్రశ్నించారు.
ప్రియాంకాగాంధీ, రాహుల్ గాంధీ కార్టూన్లను పెడితే ఎలాఉంటుంది..?
ఇదిలా ఉంటే ఓవైసీ కూడా కాంగ్రెస్ చర్యను తప్పుబట్టారు. మహిళలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని ధ్వజమెత్తారు ఓవైసీ. నిరసన తెలిపేందుకు తప్పుడు పోస్టరు వినియోగించారని ఆయన మండిపడ్డారు. నిరసన తెలపాల్సిన పద్ధతి ఇదికాదని హితవు పలికారు. సోనియా గాంధీ, లేదా ప్రియాంకా గాంధీ, లేదా రాహుల్ గాంధీల కార్టూన్లు ఇలా తయారు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. సోనియా గాంధీ అంటే తనకు అపారమైన గౌరవముందన్నారు ఓవైసీ. కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలపాలంటే ఎలాగైనా తెలపొచ్చు కానీ మహిళలను కించపరిచేలా ఉండకూడదని ఓవైసీ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎవరి మనోభావాలను కించపరచలేదు
మరోవైపు తాము చేపట్టిన నిరసన ప్రదర్శనను సమర్థించుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఛీఫ్ మర్రి శశిధర్ రెడ్డి. పోస్టరులో ఉన్నది తమకేదీ తప్పుగా అనిపించలేదన్నారు. రాహుల్ గాంధీ నుంచి క్షమాపణ చెప్పించేందుకు బీజేపీ కష్టపడుతున్నట్లు ఉందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. తను కూడా ఓ హిందువునని హిందువుల మనోభావాలు దెబ్బతినే చర్యలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడదని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉందో ఆ పోస్టరు సింబాలిక్గా చెబుతోందని అన్నారు. ఎన్నికల కమిషన్ ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో విఫలమైందని మర్రి శశిధర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఒక హిందువుగా ఉన్న తను హిందువుల సెంటిమెంట్లను పరిరక్షిస్తానని చెప్పుకొచ్చారు.