'టీఆర్ఎస్లో కేటీఆర్కు ప్రాధాన్యత, మంత్రి హరీష్ రావు ఆందోళన'
హైదరాబాద్: టీఆర్ఎస్లో మంత్రి కేటీఆర్కు ప్రాధాన్యత పెరుగుతోందని, దానిని చూసి మరో మంత్రి హరీష్ రావు ఆందోళనకు గురవుతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు.
టీఆర్ఎస్లో తన ఉనికిని కాపాడుకునేందుకే హరీష్ రావు అదే పనిగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. టీఆర్ఎస్లో విభేదాలు ప్రెషర్ కుక్ర్ మాదిరిగా ఉడుకుతున్నాయని, అవి ఎప్పుడైనా పేలొచ్చని వ్యాఖ్యానించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 45 డివిజన్లలో విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
మంగపేటలో మూతబడిన బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై అక్కడి కార్మికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. బిల్డ్ ప్యాక్టరీని పునరుద్ధరించాలంటూ గతేడాదిన్నరగా కార్మికులు పోరాడుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో బిల్ట్ ప్రధాన గేటు ఎదుట సీఎం కేసీఆర్ చిత్ర పటానికి సోమవారం క్షీరాభిషేకం చేశారు. అనంతరం కేసీఆర్ చిత్రపటాలతో భారీ ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి జేఏసీ నాయకులు పూలమాలలు వేశారు.
ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా జిల్లాలోనే అతిపెద్ద పరిశ్రమ అయిన బిల్ట్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తున్న కేసీఆర్ గొప్పతనం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని అన్నారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేసిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కార్మికులు ఎంతో రుణపడి ఉంటారని చెప్పారు.
కార్యక్రమంలో బిల్ట్ జేఏసీ నాయకులు వడ్డెబోయిన శ్రీనివాసులు, పుసునూరి గణపతి, వడ్లూరి రాంచందర్, చాతరాజు చొక్కారావు, డీవీపీ రాజు, మేడ లక్ష్మీనారాయణ, వంగేటి వెంకట్రెడ్డి, కుర్బాన్అలీ, పప్పు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.