'కేసీఆర్! సన్నాసి ఎవడు?': కొత్త ట్విస్ట్.. ఏపీకి పోలవరంలా.. అడగలేదే!
హైదరాబాద్: మహారాష్ట్రతో ఒప్పందం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. 152 మీటర్లకే వెంగళరావు, కిరణ్ కుమార్ రెడ్డిలు ఒప్పందాలు చేసుకున్నారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలను కేసీఆర్ మహారాష్ట్రకు తాకట్టు పెట్టారన్నారు.
100 మీటర్ల నుంచి 540 మీటర్లకు ఎత్తి పోయడమా.. మెడ మీద తలకాయ ఉన్న వాడు ఎవడైనా అలా చేస్తారా అన్నారు. తాము అసత్య ఆరోపణలు చేస్తే జైలుకు పంపిస్తానని కేసీఆర్ చెప్పడం విడ్డూరమని, అసలు జైలుకెళ్లేది కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే అని మల్లు భట్టి విక్రమార్క, మధుయాష్కీ అన్నారు.
కిరణ్ రెడ్డి హయాంలోనే 152 మీటర్లకు ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని కేసీఆర్ సవాల్ చేశారు. దీనికి కాంగ్రెస్ నేతలు ధీటుగా స్పందిస్తూ.. కొన్ని పత్రాలు మీడియాకు చూపించారు.
152 మీటర్లకు ఆధారాలివిగో
కాంగ్రెస్ హయాంలో 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టిని నిర్మించేలా ఏ ఒప్పందాలు కుదుర్చుకున్నారని సీఎం కేసీఆర్ అడుగుతున్నారని, ఇందుకు కళ్ల ముందే ఎన్నో సాక్ష్యాలున్నాయని టి జీవన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డితో కలిసి అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
కిరణ్ రెడ్డి హయాంలో..
ప్రభుత్వ సాంకేతిక సలహాదారు విద్యాసాగర్రావు, ఈఎన్సీ మురళీధర్రావు నేతృత్వంలోని కమిటీ తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014 ఆగస్టు 16న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై చర్చకు కూర్చుందని, అది రూపొందించిన నివేదికలో ప్రాజెక్టు ఎత్తు 152 మీటర్లుగా ప్రతిపాదించిందని, దీనివల్ల 1850 ఎకరాలు ముంపునకు గురవుతుందని గుర్తించిందన్నారు.
వెంగళరావు సమయంలోనే..
1978లో నాటి సీఎం వెంగళరావుతో కుదుర్చుకున్న ఒప్పందంలో రాష్ట్రానికి దక్కే నీటి వాటా అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఎత్తును ప్రతిపాదిస్తున్నట్లు ఆ నిపుణుల కమిటీ చెప్పిందన్నారు. ఈ వాస్తవాలన్నీ దాచేసి తమను సన్నాసులనడం ఎంత వరకూ సమంజసమని కేసీఆర్ను ప్రశ్నించారు.
పోలవరం ప్రస్తావన
అసలు సన్నాసి ఎవరని, మేమా, నువ్వా? చెప్పాలని సీఎం కేసీఆర్ను జీవన్ రెడ్డి నిలదీశారు. పోలవరం కోసం రెండు లక్షల ఎకరాలు పోగొట్టుకున్నప్పుడు తుమ్మిడిహట్టి కోసం మూడు వేల ఎకరాలకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని ద్వారా ఒప్పించలేమా అని ప్రశ్నించారు. ఈ పని చేయకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టుపెట్టిన దౌర్భాగ్యుడు కేసీఆర్ అన్నారు. కాగా, టిడిపి నేత రాజేంద్రప్రసాద్ కూడా.. తమకు పోలవరం కోసం తెలంగాణ చేత భూమి ఇప్పించినట్లు, మహారాష్ట్ర నుంచి తెలంగాణకు ఇప్పించవచ్చునని అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ మహా దోపిడీ
మహారాష్ట్ర ఒప్పందం పేరుతో సీఎం కేసీఆర్ మహా దోపిడీకి, మహా మోసానికి పాల్పడుతున్నారని మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. ఈ ఒప్పందాలు కల్వకుంట్ల ఫ్యామిలీకి బంగారం, హరీశ్కు పన్నీరు జల్లు అవుతాయని, తెలంగాణ ప్రజలకు మాత్రం కన్నీరే మిగులుతుందన్నారు.
రావుల పాలనలో ఏమీ రావు
'రావు'ల పాలనతో ప్రజలకు ఏమీరావని మధుయాష్కీ అన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచిన మాట వాస్తవం కాదా? అని మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రయోజనాలకు తెలంగాణ ఆస్తిని దోచిపెట్టే హక్కు సీఎంకు ఎక్కడిదని ప్రశ్నించారు.
రావుల పాలనలో ఏమీ రావు
'రావు'ల పాలనతో ప్రజలకు ఏమీరావని మధుయాష్కీ అన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచిన మాట వాస్తవం కాదా? అని మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రయోజనాలకు తెలంగాణ ఆస్తిని దోచిపెట్టే హక్కు సీఎంకు ఎక్కడిదని ప్రశ్నించారు.
పైసా ఖర్చు లేకుండా మహాకు లాభం
పైసా ఖర్చులేకుండా మహారాష్ట్రకు ఈ ఒప్పందాల ద్వారా 13.5 టీఎంసీల నీరు దక్కుతోందని, మహారాష్ట్ర పత్రికలు ఈ విషయాన్ని వారి సీఎం ఘనతగా చాటుకుంటున్నాయని అన్నారు. మన సీఎం కేసీఆర్ ఏం సాధించుకొచ్చారని సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు.