తెరాస నేతకు కొండా ఫోన్: 'చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రలోభాలకు తెరలేపిన కాంగ్రెస్!'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. హంగ్ ఏర్పడే పరిస్థితులు వస్తే ఏం చేయాలనే అంశంపై చర్చించేందుకు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ వద్దకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వెళ్లారు. సుదీర్ఘంగా మాట్లాడారు.
మరోవైపు ఎవరికీ మెజార్టీ సీట్లు రాకుండా.. తెరాస కంటే కూటమికి ఎక్కువ సీట్లు వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు తమనే పిలవాలని నాలుగు పార్టీల నేతలు గవర్నర్ నరసింహన్ను కలిశారు. స్వతంత్ర అభ్యర్థుల పైన ఇరు పార్టీలు కన్నేశారు. ఈ నేపథ్యంలో మరో అంశం తెరపైకి వచ్చింది. ప్రలోభ పెట్టే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన వచ్చాయి.
షాకింగ్!: 'గజ్వెల్లో 50వేల ఓట్లతో ఓడిపోనున్న కేసీఆర్, డిపాజిట్ రాని పరిస్థితి'
ప్రలోభపెట్టే ప్రయత్నాలు
ఎన్నికల ఫలితాలకు ముందే కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు తెరలేపిందని తెరాస నేత, ఆ పార్టీ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో హంగ్ రాబోతోందని, కాంగ్రెస్లోకి రావాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన తనకు వచ్చిన ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలను మీడియాకు చూపించారు.
నా వద్ద ఆ ప్రస్తావన తేవొద్దని చెప్పా
ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం రెండు గంటల ఏడు నిమిషాలకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ చేశారని, కాంగ్రెస్ పార్టీకి మద్దతవ్వాలని అడిగారని, కానీ అలాంటి విషయాలు తన వద్ద మాట్లాడవద్దని, అవి తన వద్ద చెల్లవని చెప్పేశానని అన్నారు. ఇలాంటి ప్రస్తావన తన వద్ద తేవొద్దని చెప్పానని మర్రి అన్నారు. తమ పార్టీకి (తెరాస) ఎనభై నుంచి తొంభై సీట్లు రావడం ఖాయమని చెప్పారు. ఇదే విషయాన్ని ఆయనతో చెప్పానని అన్నారు.
చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రలోభాలకు తెరలేపారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మహాకూటమి నేతలు ప్రలోబాలకు తెరలేపారని మర్రి ఆరోపించారు. కాంగ్రెస్ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తోందని ఆపద్ధర్మ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. హంగ్ ఏర్పడే పరిస్థితి ఉందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు.
ధీటుగా స్పందించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
తెరాస నేత మర్రి ఆరోపణలపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ధీటుగానే స్పందించారు. నాగర్కర్నూలు టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డినే తనకు తొలుత ఫోన్ చేశారని, ఒక ఫోన్ చేస్తేనే టీఆర్ఎస్ నేతలు అమ్ముడు పోతారా అని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నుంచి నేతలను ప్రలోభ పెట్టే అలవాటు కాంగ్రెస్కు లేదని చెప్పారు. 63 మంది గెలిచిన తెరాసలో ఈరోజు 90 మంది సభ్యులెలా ఉన్నారో చెప్పాలన్నారు. ఫోన్ చేసినంత మాత్రాన బేరసారాలకే అని ఎందుకు అనుకుంటారన్నారు.
ఫోన్ నిజమే కానీ
తాను ఫోన్ చేసింది నిజమేనని, ఓటింగ్ గురించి అడిగానని కొండా చెప్పారు. తాను సీ ఓటర్, లగడపాటి రాజగోపాల్ సర్వేలను మాత్రమే నమ్ముతానని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ ఒంటరిగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేనందునే మజ్లిస్ పార్టీతో చర్చలు జరుపుతోందని విమర్శించారు. లేదంటే ఆ చర్చలు ఎందుకని ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం తెరాస నేతలు కూడా తనకు చాలామంది కాల్ చేసారని, అలాగే తాను కూడా క్యాజువల్గా చేశానని చెప్పారు.