వరంగల్ కాంగ్రెసు అభ్యర్థి రాజయ్య: కలిసి రాబోమన్న వామపక్షాలు
హైదరాబాద్: వరంగల్ లోకసభ ఉప ఎన్నికలకు కాంగ్రెసు అభ్యర్థి ఖరారయ్యాడు. మాజీ పార్లమెంటు సభ్యుడు రాజయ్యను బరిలోకి దింపాలని కాంగ్రెసు నాయకత్వం నిర్ణయించింది. స్థానికుడైనందున కాంగ్రెసు అధిష్టానం రాజయ్య వైపే మొగ్గు చూపింది. గత ఎన్నికల్లో రాజయ్య కడియం శ్రీహరిపై 3 లక్షల 96 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాజయ్య 2009 నుంచి 2014 వరకు వరంగల్ నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహించారు.
మాజీ పార్లమెంటు సభ్యుడు వివేక్ను బరిలోకి దింపాలని కాంగ్రెసు నాయకత్వం తీవ్రంగానే ప్రయత్నించింది. అయితే, వివేక్ ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ స్తితిలో పలువురి పేర్లు ముందుకు వచ్చాయి. మరో మాజీ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ పోటీ చేయడానికి ముందుకు వచ్చింది. అయితే, పార్టీ అధిష్టానం ఎట్టకేలకు రాజయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.
కాగా, వామపక్షాలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ను బరిలోకి దింపాలని నిర్ణయించాయి. తమ అభ్యర్థికి మద్దతు ఇచ్చి ప్రతిపక్షాల మధ్య పోటీని నివారించాలని కాంగ్రసు నాయకులు వామపక్షాలను కోరారు. అయితే, అందుకు వామపక్షాలు అంగీకరించలేదు.
సిపిఐ, సిపిఎంలతో కాంగ్రెసు నాయకులు శనివారం మంతనాలు జరిపారు. గాలి వినోద్ కుమార్ వంటి విద్యావంతుడిని స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దింపితే తాము మద్దతు ఇస్తామని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు కాంగ్రెసు పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) తన అభ్యర్థిగా పసునూరి దయాకర్ పేరును ఖరారు చేసింది. మిత్రపక్షాలైన బిజెపి, టిడిపి కూటమి అభ్యర్థి తేలాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కొంత మంది వరంగల్ సీటును తమ పార్టీకే ఇవ్వాలని అడుగుతున్నారు. కానీ, ఆ సీటును బిజెపికి వదిలిపెట్టాలనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది.