'బీజేపీకి కేసీఆర్ పరోక్ష మద్దతు, థర్డ్ ఫ్రంట్ పేరుతో వారికి మేలు'
అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవేగౌడను కలవడం, కాంగ్రెస్-బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు చేయడంప ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరా రెడ్డి శుక్రవారం మండిపడ్డారు.
విభజన హామీలు అమలు చేయకుండా ఉండేందుకు బీజేపీకి కేసీఆర్ పరోక్షంగా మద్దతిస్తున్నారని ఆరోపించారు. మూడో కూటమి పేరుతో బీజేపీకి మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఆలస్యమైందన్నారు.
2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హోదా ఇస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై 9 రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలతో తీర్మానం చేయించామన్నారు. చట్టం అవసరం లేకుండానే గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
విభజన హామీలను బీజేపీ తుంగలో తొక్కిందన్నారు. చట్టం అమలు చేయకుండా పదాలు అడ్డంకిగా ఉన్నాయంటూ సాకులు వెతుకుతున్నారని మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని పదాలు అడ్డంకిగా ఉంటే ఎందుకు సవరణ చేయలేదన్నారు.