నేతలను ఖంగు తినిపించిన కాంగ్రెస్ తొలి జాబితా..! జాబితాలో పేరు లేకపోవడానికి కారణం అదేనా..!!
హైదరాబాద్ : కాంగ్రెస్ మొదటి జాబితా ప్రకటన ఆ పార్టీ ఆశావహులను అసహనానికి గురిచేస్తోంది. సీనియర్ నేతలను సైతం అయోమయానికి గురి చేస్తున్న తొలి జాబితా పై అసంత్రుప్తిని వ్యక్తం చేస్తున్నారు నాయకులు. పీసిసి వంటి కీలక పదవులు అలంకరించిన పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్ నాయకుడి పేరు తొలి జాబితాలో గల్లంతు కావడంతో ఆశ్యర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. తొలి జాబితాలో సీటు రాని నేతలు గాందీభవన్ ఢిల్లీలో తేల్చుకునేందకు రెఢీ అవుతున్నారు.
కాంగ్రెస్ తొలిజాబితా పట్ల అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్లు..! ఛలో ఢిల్లీ దిశగా మంతనాలు..!!
ఊహించిన విధంగా జనగామ నియోజకవర్గం నుంచి మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య పేరు గల్లంతయింది. పెండింగ్ లో పెట్టారా లేదా ఈ నియోజకవర్గాన్ని టీజేఎస్ కు అప్పగించనున్నందున పొన్నాల లక్ష్మయ్య ఇవ్వలేదని అంటున్నారు. కొత్తగూడెం, మునుగోడు. దేవరకొండ నియోజవర్గాలు తమకే కేటాయించాలని సీపీఐ పార్టీ కోరినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సీతక్క, చొప్పదండి సత్యం, విజయ రమణా రావులకు సీట్లు దక్కాయి.
తుంగతుర్తి ఆశించిన దయాకర్ కు భంగపాటు..! తెలంగాణ ఉద్యమకారులకు మొండిచెయ్యి..!!
అద్దంకి దయాకర్ తుంగతుర్తి సీటు కోసం ఆశలు పెట్టుకోగా జాబితాలో పేరు దక్కలేదు. మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి సూచించిన వ్యక్తికి దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. టీజేఎస్ కోరిన రామగుండం, స్టేషన్ ఘనపూర్, ఆసిఫాబాద్ స్థానాల్లో కూడా కాంగ్రెస్ తన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇంటి పార్టీ కి నకిరేకల్ స్థానం కేటాయిస్తారని అనుకున్నప్పటికీ కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుడు చిరుమర్తి లింగయ్యకే దక్కింది. ఉద్యమకారులను అక్కును చేర్చుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ఒక్క ఉద్యమకారుడికి కూడా మొదటి జాబితాలో అవకాశం కల్పించకపోవడం గమనార్హం.
మర్రి శశిధర్, పి.విష్ణువర్దన్ రెడ్డి సీట్లు టీడీపీకి ఇస్తారా..? కొనసాగుతున్న ఉత్కంఠ..!!
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డితో పాటు అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు అవకాశం కల్పించారు. అలాగే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి రెడ్డికి సీటు ఇచ్చారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం విద్యార్థులు, ఉద్యమకారులకు అవకాశం కల్పిస్తారనే వార్తలు వచ్చాయి. కాని ఒక్కరికి కూడా మొదటి జాబితాలో అవకాశం కల్పించలేదు. హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్న మర్రి శశిధర్ రెడ్డి, పీ.విష్ణువర్థన్ రెడ్డి కుటుంబాలకు మొండి చెయ్యి చూపారు.
కొత్తగూడెంలో వనమాకు అవకాశం..! రేవంత్ తో పాటు చేరిన ముగ్గురికి సీట్లు..!!
రాష్ట్రంలోని, కేంద్రంలోని నాయకులు కాకుండా గాంధీ కుటుంబాన్ని నమ్ముకుని పనిచేస్తున్నారు. ఇద్దరికి చోటు కల్పించకపోవడం, పెండింగ్ లో పెట్టడం పలు అనుమానాలకు దారి తీస్తున్నది. ఈ రెండు స్థానాలను టీడీపీ కోరుతున్నదనే వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. రెండో జాబితా లేదా చివరి జాబితాలో వీరికి అవకాశం కల్పిస్తారా లేదా టీడీపీ కి కేటాయిస్తారో తెలియాల్సి ఉంది. మొత్తం 119 నియోజకవవర్గాలలో 65 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఉమ్మడి హైదరాబాద్ నుంచి 7, రంగారెడ్డి 6, మెదక్ 5, ఖమ్మం 4, నల్లగొండ 9, మహబూబ్ నగర్ 8, నిజామాబాద్ 5, అదిలాబాద్ 7, కరీంనగర్ 8, వరంగల్ 7 నియోజకవర్గాలలో మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు.