'ఆ ఐదుగురు సీఎంలకు నోట్ల రద్దు ముందే తెలుసు'
పెద్ద నోట్ల రద్దు విషయం దేశంలోని ఐదుమంది సీఎంలకు ముందుగానే తెలుసునని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: దేశంలోని చాలామట్టుకు ప్రతిపక్షాలు ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తీవ్ర ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు భారత్ బంద్ పిలుపునివ్వడం.. విపక్ష పార్టీలు రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగాయి.
ఇదే క్రమంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. దిల్సుఖ్నగర్ రాజీవ్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా నోట్ల రద్దు లీకేజీ ప్రస్తావన తీసుకొచ్చిన ఆయన.. ఎన్డీయే స్వపక్షంలోని ఐదుగురు సీఎంలకు రద్దు విషయం ముందుగానే తెలుసని ఆరోపించారు. ప్రధాని అనాలోచిత చర్యకు సామాన్యులు బలవుతున్నారని, విషయం ముందే తెలిసిన సీఎంలంతా తమ లావాదేవీలను చక్కబెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న కొత్త నోట్లు కూడా మళ్లీ నల్లకుబేరుల చేతుల్లోకే వెళ్తున్నాయని సుధీర్ రెడ్డి ఆరోపించారు.