టీఆర్ఎస్ అభ్యర్థులపై కాంగ్రెస్ కన్ను..!బలమైన అభ్యర్థులను నిలబెట్టే దిశగా కాంగ్రెస్.!
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం మారుస్తోంది. గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్త పడుతోంది. బలహీనంగా ఉన్న గులాబీ అభ్యర్థుల మీద బలమైన కాంగ్రెస్ నేతలను రంగంలోకి దించాలని ప్రణాళికలు రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ. పాత పది జిల్లాల ప్రకారం తెలంగాణలో గులాబీ పార్టీనుండి బరిలోకి దిగే అభ్యర్థుల బలం-బలహీనతలపై కాంగ్రెస్ పార్టీ లోతుగా అద్యయనం చేస్తోంది. అందుకు తగ్గట్టే నియోజక వర్గాల్లో బలమైన నాయకులను రంగంలోకి దించి ఫలితాన్ని రాబట్టాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇదే వ్యూహంలో భాగంగా నాగార్జున సాగర్ నియోజక వర్గం నుండి జానారెడ్డిని మిర్యలగూడకు పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ లో భారీ మార్పులు..! గెలుపు గర్రాల కోసం వేట..! నియోజక వర్గాల కూర్పులు..!!
టీఆర్ఎస్ తీసుకున్న అనూహ్య నిర్ణయానికి అంతే ధీటుగా సమాధానం చెప్పాలనుకుంటున్నాయి అక్కడి ప్రతిపక్ష పార్టీలు. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ స్పీడు పెంచేసింది. గత ఎన్నికల సమయంలో తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకోవడంలో విఫలమైన నేతలు ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఈ సారి గత ఫలితాలను పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకోసమే టీకాంగ్రెస్ అధిష్ఠానం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. బలహీనంగా ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థుల స్థానాల్లో బలమైన కాంగ్రెస్ నేతలను రంగంలోకి దించాలని వ్యూహం రచిస్తోంది కాంగ్రెస్ అదిష్టానం.
గులాబీ బలహీన అభ్యర్థుల పై నజర్..!రంగంలోకి బలమైన కాంగ్రెస్ అభ్యర్థులు ..!!
తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సహా మరో రెండు పార్టీలను కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, ఆయా పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే దీని తాలూకు చర్చలు పూర్తి అయ్యాయని, సీట్ల సర్ధుబాటు కూడా అయిపోయిన వెంటనే దీని గురించి అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత టీఆర్ఎస్కు చెక్ పెట్టేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో వెంటనే టీఆర్ఎస్ కూడా ఆయనకు కౌంటర్ ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
జానారెడ్డి మిర్యాలగూగకు..? ఆయన కూమారుడు నాగార్జున సాగర్ కు..?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నాగార్జున సాగర్ తాజా మాజీ ఎమ్మెల్యే జానారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే స్థానాన్ని మార్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత స్థానాన్ని వదులుకుని మిర్యాలగూడ నుంచి బరిలో నిలవాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, ఏడు సార్లు గెలిచిన సాగర్ స్థానాన్ని జానారెడ్డి తన కుమారుడు రఘువీర్కు ఇప్పించాలని కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన మిర్యాలగూడలో నిలవాలని నిర్ణయించుకున్నారని వినికిడి. సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య అనంతరం అతని భార్య అమృతవర్షిణిని పరామర్శించడానికి జానారెడ్డి మిర్యాలగూడకు వెళ్లడం కూడా అక్కడి నుంచి పోటీ చేసే వ్యూహంలో భాగమేనని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ వ్యూహంతో టీఆర్ఎస్ కి తలనొప్పులు..! అభ్యర్థులను మార్చాలని నిర్నయం..!!
మరోవైపు ఇక్కడి నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావుకు కేసీఆర్ టీఆర్ఎస్ టికెట్ కేటాయించారు. 2014లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆయన అనంతరం టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ ఈ నెల 6న ప్రకటించిన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో భాస్కర్రావుకూ చోటు కల్పించారు. ఇప్పుడు జానారెడ్డి వార్త బయటకు రావడంతో టీఆర్ఎస్ కూడా అక్కడ అభ్యర్ధిని మార్చాలని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జానారెడ్డి ప్రతిపాదనకు అదిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.