దానం బాటలో ముఖేష్ గౌడ్: అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి ఉత్తమ్, తాజా పరిణామాల చర్చ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ బాటలోనే మరో సీనియర్ నేత ముఖేష్ గౌడ్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం ముఖేష్ గౌడ్.. టీఆర్ఎస్ పార్టీ నేతలను కలవడం ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది.
ఆ వర్గానిదే డామినేషన్, రాహుల్కు చెప్పినా..: పార్టీ వీడటంపై దానం, 'సత్తా ఏంటో చూపిస్తా'
అయితే, ముఖేష్ గౌడ్ తనతోపాటు తన కుమారుడు విక్రమ్ గౌడ్కు కూడా టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే తన కుమారుడు, ఇతర కార్యకర్తలతోపాటు ముఖేష్ గౌడ్ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
జులై 1న కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయం ప్రకటించనున్నారు ముఖేష్ గౌడ్. ఇప్పటికే దానం నాగేందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరిక ఖరారైపోయింది. ఆయన ఆదివారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
ఉత్తమ్కు ఢిల్లీ పిలుపు
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కాంగ్రెస్ వార్ రూమ్లో సీనియర్ నేతలతో ఉత్తమ్ భేటీ కానున్నారు. దానం రాజీనామా, ఇతర తాజా రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.