కాంగ్రెస్లో 'రేవంత్ రెడ్డి' చిచ్చు.. సీనియర్లకు హైకమాండ్ షాక్..
కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి ఇప్పటివరకు సీనియర్లతో ఎంపీ రేవంత్ రెడ్డికి సఖ్యత లేదన్న విమర్శ ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా అది బయటపడుతూనే ఉంది. టీపీసీసీ పదవి విషయంలో కావచ్చు.. తాజాగా తెరపైకి వచ్చిన డ్రోన్ కేసు విషయంలో కావచ్చు.. రేవంత్ వైపు నిలబడేందుకు సీనియర్లు ముందుకు రాని పరిస్థితి. ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న తమ కంటే రేవంత్కి ఎక్కువ ప్రాధాన్యత దక్కడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారా.. లేక రేవంత్ ఎప్పటికీ చంద్రబాబు మనిషే అన్న అభిప్రాయమా.. మొత్తానికి రేవంత్కు,సీనియర్లకు మధ్య ఆ గ్యాప్ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో రేవంత్ డ్రోన్ కేసు విషయంలో హైకమాండ్ సీనియర్లకు గట్టి షాక్ ఇచ్చింది.
డ్రోన్ కేసు వ్యక్తిగత వ్యవహారమన్న సీనియర్లు..
రేవంత్ రెడ్డిపై పెట్టిన డ్రోన్ కేసు వ్యక్తిగత వ్యవహారమని.. దాన్ని పార్టీపై రుద్దవద్దని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బహిరంగంగానే విరుచుకుపడ్డారు. మరో సీనియర్ నేత దామోదర రాజనరసింహ కూడా.. రేవంత్ కేసు కంటే రాష్ట్రంలో ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అటు సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి,జానారెడ్డి తదితరులు.. వీళ్లెవరూ రేవంత్ కేసు విషయాన్ని అంత సీరియస్గా పట్టించుకోవట్లేదన్న విమర్శ ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు వీళ్లెవరూ మీడియా ముఖంగా రేవంత్కు గట్టి మద్దతు తెలపలేదు.
రేవంత్ విషయంలో కాంగ్రెస్లో స్పష్టమైన చీలిక..
రేవంత్ డ్రోన్ కేసు వ్యవహారంలో కాంగ్రెస్లో స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. ఓవైపు కొంతమంది సీనియర్లు రేవంత్ కేసును వ్యక్తిగత వ్యవహారమని పక్కనపెడుతుంటే.. మల్లు రవి,షబ్బీర్ అలీ,ఎమ్మెల్యే సీతక్క వంటి నేతలు మాత్రం రేవంత్కు మద్దతుగా నిలిచారు. రేవంత్ వ్యక్తిగత ఎజెండతో ముందుకెళ్తున్నారని సీనియర్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. డ్రోన్ కేసు వ్యవహారంలో సైలెంట్గా జైలుకెళ్లిన రేవంత్ రెడ్డి.. విడదల సమయంలో మాత్రం భారీ ర్యాలీకి ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్లో తానే హీరోని అన్న సంకేతాలు పంపించేందుకే రేవంత్ ఇదంతా చేస్తున్నారని.. పార్టీని పక్కనపెట్టి వ్యక్తిగతంగా హైలైట్ అవడం కోసమే పాకులాడుతున్నారని సీనియర్లు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
సీనియర్లకు హైకమాండ్ షాక్..
రేవంత్ డ్రోన్ కేసు వ్యక్తిగత వ్యవహారమని కొంతమంది సీనియర్లు చెబుతుంటే.. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం వారికి షాకిచ్చేలా వ్యవహరిస్తోంది. డ్రోన్ కేసులో సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ను హైకమాండ్ అపాయింట్ చేయడం.. ఆ సీనియర్లకు మింగుపడని విషయం. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ప్రత్యేకంగా చొరవ చూపి ఖుర్షీద్ను అపాయింట్ చేసినట్టు తెలుస్తోంది. మున్ముందు రాష్ట్రాల్లో యువ నేతలకే ప్రాధాన్యమన్న సంకేతాలు ఈ చర్యతో కాంగ్రెస్ హైకమాండ్ పంపిందన్న వాదన కూడా వినిపిస్తోంది. అదే నిజమైతే భవిష్యత్తులో టీపీసీసీ రేవంత్కే ఇచ్చే అవకాశాలు ఉండవచ్చు. అయితే నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్కు అంత ప్రాధాన్యమా అని సీనియర్లు బహిరంగంగా విమర్శిస్తున్న వేళ.. కాంగ్రెస్ రేవంత్కు పట్టం కట్టడం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరం. ఏదేమైనా రేవంత్ వ్యవహారంపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదన్నది తేటతెల్లమవుతోంది.
Recommended Video
హైకోర్టులో వాదనలు..
రేవంత్ డ్రోన్ కేసుపై హైకోర్టులో వాదించిన ఖుర్షీద్.. పోలీసులు అరెస్టుకు కుంటిసాకులు చెబుతున్నారని వాదించారు. రేవంత్పై ఎఫ్ఐఆర్,రిమాండ్ ఆర్డర్ను రద్దు చేయాలని,వెంటనే బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే ఖుర్షీద్ వాదనలను వ్యతిరేకించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.. డ్రోన్ కేసులో ఏ-1 రేవంత్ రెడ్డి పొలిటికల్ మైలేజ్ కోసమే పోలీస్ స్టేషన్కు వెళ్లి అరెస్ట్ చేసి జైలుకు పంపాలని కోరినట్టు తెలిపారు. రేవంత్ సూచనల మేరకే ప్రైవేట్ ఆస్తుల్లో డ్రోన్ కెమెరాలతో షూట్ చేశారన్నారు. ఐపీసీ సెక్షన్ 188తో పాటు 287,109 సెక్షన్లు కూడా చేర్చినట్టు తెలిపారు.