పీవీ అంత దుర్మార్గుడా..? కామెంట్ చేసిన నేతకు షోకాజ్..! అపర చాణక్యుడిపై వివాదం
హైదరాబాద్ : ఆర్థిక సంస్కరణల పితామహుడిగా దేశానికి సేవలందించారు. కిష్టమైన పరిస్థితుల్లో మైనారిటీ సర్కారును ఐదేళ్లపాటు నడిపించారు. అపరచాణక్యుడిగా దక్షిణ భారత దేశం నుంచి ప్రధాని పదవిని అలంకరించిన తొలి వ్యక్తి. ఆయనెవరో కాదు తెలంగాణ ఠీవిగా ముద్రపడ్డ పీవీ నరసింహరావు.
శుక్రవారం నాడు పీవీ 98వ జయంతి జరుపుకుంటున్న వేళ ఆయనను స్మరించుకోవాల్సింది పోయి ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి ఆరోపణలు గుప్పించడం చర్చానీయాంశమైంది. పీవీ నరసింహరావును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దేశానికి విశిష్ట సేవలు అందించిన పీవీపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడటం తగదని హైకమాండ్ తలంటింది.
కేంద్రంలో పవర్ఫుల్.. ఏపీలో బలపడే ప్రయత్నం.. మరి తెలంగాణలో బీజేపీ ఫెయిల్యూరా?
Recommended Video
పీవీ జయంతి వేళ కాంగ్రెస్ పార్టీలో దుమారం
దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను ఉద్దేశించి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపాయి. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. పీవీని ఉద్దేశిస్తూ తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన వ్యక్తిగా అభివర్ణించారు. నాగ్పూర్లో అప్పట్లో జరిగిన ఆరెస్సెస్ సభకు వెళ్లి సంఘ్ భావజాలాన్ని పొగిడినందుకు ప్రణబ్ ముఖర్జీని బీజేపీ భారతరత్నతో సత్కరించిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది.
ఆ ఇద్దరు మహా నేతల గురించి చిన్నారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్టీ పెద్దలు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ సేవలు అందించిన నేతలను ఆ విధంగా కించపరచడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని.. అలా ఎందుకు అనాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కోరారు.
ఆ ఉద్దేశంతో అనలేదు.. చిన్నారెడ్డి వివరణ
హైకమాండ్ వివరణ ఇవ్వాలని కోరడంతో చిన్నారెడ్డి స్పందించారు. ఆ మేరకు పార్టీ పెద్దలకు లేఖ రాశారు. పీవీ నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీ అంటే తనకు అపారమైన గౌరవమని అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు బీజేపీ నేతలకు ఎందుకని తాను ప్రశ్నించానే తప్ప పీవీ, ప్రణబ్లను అవమానించాలనే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పుకొచ్చారు. ఆ నేతలంటే తనకు ఎంతో అభిమానమన్న చిన్నారెడ్డి.. తాను చేసిన వ్యాఖ్యలతో అపార్థాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా నొచ్చుకుంటే అందుకు చింతిస్తున్నట్లు చెప్పారు.
పీవీ.. తెలంగాణ ఠీవీ
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో 1921, జూన్ 28న రుక్మిణమ్మ - సీతారామారావు దంపతులకు పీవీ నరసింహరావు జన్మించారు. వేలేరులో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసి వరంగల్లో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఎస్సీ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. అనంతరం రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో కీలక పాత్ర వహించారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా పని చేశారు. 1958లో మంథని నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అలా వరుసగా 1972 వరకు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు.
కాసు బ్రహ్మానందరెడ్డి కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా.. సమాచార, న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1971 - 73 టర్మ్లో ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. భూసంస్కరణల చట్టం తెచ్చి తనకున్న వెయ్యి ఎకరాలను పేదలకు పంచి ఆదర్శంగా నిలిచారు. 1977లో హన్మకొండ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై కేంద్రంలో కీలకపాత్ర పోషించారు.
ప్రధానిగా అవకాశం.. ఢిల్లీ పీఠంపై తెలుగోడు
రాష్ట్రం నుంచి ఢిల్లీ బాట పట్టిన పీవీ అనతికాలంలోనే గుర్తింపు పొందారు. ఇందిరా గాంధీతో పాటు రాజీవ్ గాంధీ హయాంలో కీలకశాఖలకు మంత్రిగా పనిచేశారు. రాజీవ్గాంధీ మరణించిన సమయంలో అనూహ్యంగా 1995వ సంవత్సరంలో దేశప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం వచ్చింది. అలాంటి మహనీయుడిని స్మరించుకుంటూ వంగరలో ఆయన జయంతి వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే హన్మకొండ జిల్లాకు పీవీ నరసింహారావు పేరు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , సాంస్కృతిక శాఖ ఛైర్మన్ రమణాచారి, బీసీ కమిషన్ ఛైర్మన్ బీఎస్ రాములు తదితరులు నివాళులు అర్పించారు. రాష్ట్రానికి, దేశానికి పీవీ అందించిన సేవలు అమోఘమని వారు కొనియాడారు. ఆర్థిక సంస్కరణలు అమల్లోకి తెచ్చిన డైనమిక్ లీడర్ అని కితాబిచ్చారు. పీవీ వందేళ్ల జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా జరుపుతామని తెలిపారు.
ఇళ్ల నిర్మాణాలకు బ్రేక్.. ఐదేళ్లు నో పర్మిషన్!.. నీటి కష్టాలే కారణమా?