ఫడ్నవీస్తో 'తగ్గింపు' డీల్: కేసీఆర్ బర్త్ డే గిఫ్ట్ రివర్స్
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ఎత్తు తగ్గిస్తే తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని, రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టే అలాంటి ప్రయత్నాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మానుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారం మండిపడ్డారు. మహారాష్ట్రతో చర్చల పేరిట కేసీఆర్ ఆ రాష్ట్ర డిమాండ్లకు తలొగ్గడం భావ్యం కాదని జీవన్ రెడ్డి అన్నారు. ముంబై వెళ్లిన కేసీఆర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తు తగ్గింపును పరిశీలిస్తామని చెప్పటం సరికాదన్నారు.
గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రభుత్వం 160 టీఎంసీల నీటిని వాడుకుంటే తమకు అభ్యంతరం లేదని, కాకపోతే 152 ఫీట్ల ఎత్తును తగ్గించాలని మహారాష్ట్ర సీఎం కోరినట్లు తెలుస్తున్నదన్నారు. దానికి కేసీఆర్ ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తూ డిజైన్ మార్పునకు అంగీకరించినట్లు వార్తలొచ్చాయన్నారు.
కేసీఆర్ మహారాష్ట్రలో తన జన్మ దినోత్సవాన్ని జరుపుకుంటే సంతోషకరమేనని, కానీ ఆ సందర్భంగా బహుమతులు పుచ్చుకోవాల్సిన ముఖ్యమంత్రి బదులుగా మహారాష్ట్ర సీఎంకు గిఫ్ట్ ఇచ్చి వచ్చారని దెప్పిపొడిచారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తును ఎట్టి పరిస్థితుల్లో తగ్గించవద్దని ఆయన డిమాడ్ చేశారు. ఎత్తు తగ్గిస్తే ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం తగ్గుతుందన్నారు.
ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క మాటనూ కేసీఆర్ నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. సోనియా కృషి వల్ల ఫిబ్రవరి 18న పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిందని గుర్తు చేశారు. బిల్లు ఆమోదం పొంది ఏడాది గడిచినా టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం సోనియాకు కృతజ్ఞత చెప్పలేదన్నారు. తెలంగాణ ఇస్తే చాలు, తమది ఉద్యమ పార్టీ మాత్రమే, రాజకీయ పార్టీ కాదు, తమకు ఏ పదవులూ వద్దంటూ చెప్పిన కేసీర్ ఏ ఒక్క మాటనూ నిలబెట్టుకోలేదన్నారు.
తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన 1200 మందిలో 459 అమరుల కుటుంబాలకు మాత్రమే ఆర్థిక సాయాన్ని అందించారని దుయ్యబట్టారు. అన్ని నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకే అభివృద్ధి నిధులు మంజూరు చేస్తున్నారన్నారు.
కేంద్రం తీసుకొచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఈ నెల 21న ఒక్క రోజు తాను నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ వి హనుమంత రావు చెప్పారు. ఇందిరాపార్కు వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు చేపట్టనున్న ఈ దీక్ష గురించి సోనియాకు లేఖ రాశానని, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యాధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, శాసన మండలి నేత డి శ్రీనివాస్లను ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు.