టీఆర్ఎస్లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు: అసెంబ్లీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా
హైదరాబాద్: తెలంగాణ సీఎల్పీ అత్యవసర సమావేశం ఆదివారం జరిగింది. ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తెరాస గూటికి చేరుతున్నట్లు చేసిన బహిరంగ ప్రకటన, ఇతర అంశాలపై వారు చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో తెరాసకు సంఖ్యాబలం ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనే దురుద్దేశంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు.
పార్టీ ఫిరాయింపులపై వరుసగా ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిర్ణయించింది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కుల పార్టీ ఫిరాయింపును నిరసిస్తూ మూడు రోజుల పాటు ఆందోళన చేయాలని నిర్ణయించింది.
ఈ నెల 5వ తేదీన పినపాక, అసీఫాబాద్లో కార్యకర్తలతో డీసీసీల సమావేశం ఉండనుంది. 6న ఆ నియోజకవర్గాల్లోని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయనున్నారు. 8న పినపాక, అశీఫాబాద్ నియోజకవర్గం కేంద్రాల్లో సీఎల్పీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నారు.