జానాతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ: మూకుమ్మడి రాజీనామాలకు సై?
హైదరాబాద్: తమ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడం, 11 మందిని సస్పెండ్ చేయడంపై కాంగ్రెసు పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. సస్పెన్షన్కు గురైన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం ఉదయం సిఎల్పీ నేత జానా రెడ్డితో సమావేశమయ్యారు.
తాజా పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకునే విషయంపై చర్చలు జరుపుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ శానససభ సభ్యత్వాలను రద్దు చేసిన నేపథ్యంలో వారి స్థానాలు ఖాళీ అవుతాయి.
ఆ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయడంతో వారి స్థానాలు రెండు ఖాళీ కావడంతో ఆ విషయాన్ని శానససభ నోటీపై చేస్తుంది. దాంతో ఆ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి. ఈ స్థితిలో తమ కార్యాచరణ ఎలా ఉండాలనే విషయంపై కాంగ్రెసు శానససభ్యులు చర్చిస్తున్నారు.
సామూహిక రాజీనామాలు చేస్తే...
ప్రభుత్వ తీరుపై కాంగ్రెసు నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో తామంతా మూకుమ్మడి రాజీనామాలు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తాము రాజీనామాలు చేస్తే ఆ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని, అప్పుడు తమ బలమేమిటో తెలుసుకోవచ్చునని కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. తమ ఆలోచనపై వారు అధిష్టానం నిర్ణయాన్ని కోరనున్నారు.
సస్పెన్షన్ ఇదే తొలిసారి...
ప్రతిపక్ష నేతను శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ, ప్రస్తుత తెలంగాణ శాసనసభలో గానీ ఇదే తొలిసారి. ప్రతిపక్ష నేత కె. జానారెడ్డిని కూడా స్పకర్ మధుసూదనా చారి మిగతా పది మంది సభ్యులతో పాటు ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేశారు.
కిషన్ రెడ్డి ఇలా, కేసిఆర్ అలా...
జానారెడ్డి హుందాతనాన్ని లెక్కలోకి తీసుకోవాల్సి ఉండిందని బిజెపి సభ్యుడు కిషన్ రెడ్డి అన్నారు. జానా రెడ్డిని కూడా సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. అయితే, కిషన్ రెడ్డి మాటలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్రంగా వ్యతిరేకించారు.