ఆ'వేదన': 'తెలంగాణ ఇచ్చినందుకు పశ్చాత్తాపం!', కెసిఆర్ జిల్లాలో ఎక్కువే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యల పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని హైదరాబాదులో లింబయ్య ఆత్మహత్య నేపథ్యంలో ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ రూ.లక్ష రూపాయల ఇచ్చింది.
లింబయ్య మృతి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం పైన నిప్పులు చెరుగుతున్నారు.
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలు బాధాకరమన్నారు. రైతుల ఆత్మహత్యలను కెసిఆర్ ప్రభుత్వం నివారించలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యల నివారణలో టిఆర్ఎస్ ప్రభుత్వం తీరు చూస్తోంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి పశ్చాత్తాపం వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు.
హైకోర్టు తేలేకపోతున్నారు: యాష్కీ
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, కానీ టీఆర్ఎస్ ఎంపీలు, ఆ పార్టీ కేవలం రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును తేలేకపోతోందని నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు.
సిఎం కెసిఆర్ జిల్లాలో 189 మంది ఆత్మహత్య
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క మెదక్ జిల్లాలోనే 189 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేరింగ్ సిటిజన్ కలెక్టివ్ స్వచ్చంధ సంస్థ (సిసిసి) డైరెక్టర్ తెలిపారు.
గురువారం రైతు ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మహిళా రైతు హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ఆత్మహత్యలు చేసుకున్న 20 కుటుంబాలతో కలిసి మెదక్ జిల్లా సిద్దిపేటలోని పాత బస్టాండు నుంచి ఆర్డీవో కార్యాలయానికి ర్యాలీ నిర్వహించారు.