టిక్కెట్కు 3 కోట్లు డిమాండ్, ఆడియో: కాంగ్రెస్ నేత సంచలనం, రాహుల్ ఇంటి వద్ద కార్తీక రెడ్డి ధర్నా
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు వీధికెక్కుతున్నారు. కూటమిలో భాగంగా టీడీపీకి, తెలంగాణ జన సమితికి కేటాయించిన సీట్ల పైన కూడా తీవ్ర ఆగ్రహావేషాలు వ్యక్తమవుతున్నాయి. సీట్ల సర్దుబాటు సందర్భంగా అన్యాయం జరుగుతోందంటున్నారు.
రచ్చ: టీడీపీకి ఎవరితో ఓట్లేయించుకుంటారో చూస్తా.. కాంగ్రెస్ పార్టీకి షాక్, సబిత కొడుకు రాజీనామా
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీట్ల కేటాయింపుపై రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు క్యామ మల్లేష్ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. ఖైరతాబాద్లో దానం నాగేందర్ను గెలిపించేందుకే దాసోజు శ్రవణ్కు టిక్కెట్ కేటాయించారని ఆరోపించారు. ఆయన హైదరాబాదులోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని కాంగ్రెస్ నేత క్యామ మల్లేష్ ఆరోపించారు. సీట్ల కేటాయింపులో యాదవులు, కుర్మలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రూ.10 కోట్లు తీసుకొని దానం నాగేందర్ పైన బలహీన అభ్యర్థి దాసోజు శ్రవణ్ కుమార్కు టిక్కెట్ కేటాయించారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్లో సీట్లను రూ.కోట్లకు అమ్ముకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దొంగల ముఠాగా వ్యవహరిస్తున్నారన్నారు.
రూ.3 కోట్లు అడిగారు
భక్తచరణ్ దాస్ ఓ నియోజకవర్గానికి రూ.3 కోట్లు అడిగినట్లుగా చెబుతున్న ఆడియో టేప్ ఉందని క్యామ మల్లేష్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆడియో తన వద్ద ఉందని ఇందుకు సంబంధించిన టేప్ విడుదల చేస్తానని అన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి టిక్కెట్ ఇచ్చేందుకు తన నుంచి రూ.3 కోట్లు అడిగారన్నారు. ఈ డబ్బును భక్తచరణ్ దాస్ కొడుకు డిమాండ్ చేశారన్నారు. స్క్రీనింగ్ కమిటీ వ్యవహారం కంచె చేను మేసినట్లుగా ఉందని చెప్పారు. పార్టీలో సీనియర్లకు కాకుండా కొత్తవారికి, బంధువర్గానికి టిక్కెట్లు ఇస్తున్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును విమర్శించే కాంగ్రెస్ పార్టీ నేతలకు సిగ్గు ఉండాలన్నారు.
రాహుల్ గాంధీ నివాసం వద్ద బండ కార్తీక రెడ్డి ధర్నా
సీట్ల కేటాయింపు సెగ ఢిల్లీకి కూడా చేరుకుంది. హైదరాబాద్ మాజీ మేయర్, కాంగ్రెస్ నేత బండ కార్తీక రెడ్డి ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నివాసం వద్ద నిరసనకు దిగారు. తనకు టిక్కెట్ కేటాయించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పోటీ చేసేందుకు తనకు అర్హత లేదా అని ప్రశ్నించారు. మహిలా మేయర్గా పని చేయడం తనకు అర్హత కాదా అన్నారు.
కార్తీక్ రెడ్డి హంగామా
రాజేంద్రనగర్ టిక్కెట్ ఆశించిన మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన అనుచరులు శంషాబాద్ కార్యాలయ పార్టీ జెండాను ధ్వంసం చేశారు. ఫ్లెక్సీని చించివేశారు. కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
సీట్ల కుంపట్లు
సీట్ల కుంపట్లు అన్ని పార్టీలలోను కనిపిస్తున్నాయి. కాంగ్రెస్లో ఎక్కువగా కనిపిస్తోంది. వరంగల్ వెస్ట్ ఇవ్వకపోవడంపై నాయిని రాజేందర్ అసంతృప్తితో ఉన్నారు. సూర్యాపేట దక్కకపోవడంపై పటేల్ రమేష్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. మంచిర్యాల సీటును ప్రేమ్ సాగర్కు ఇవ్వడంపై అరవింద్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి టిక్కెట్ తనకు కేటాయించకపోవడంపై భిక్షపతి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షాద్ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ రెబల్గా శంకర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. వికారాబాద్లో మెతుకు ఆనంద్కు టిక్కెట్ ఇవ్వడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. జనగామ నియోజకవర్గంపై పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీలో తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.