తమిళి సై కామెంట్స్: సీఎం రాజీనామా చేయాలి, అసమర్థతకు నిదర్శనం, ఆ వ్యాఖ్యలు సమర్థన
కరోనా వైరస్ నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వ చర్యల అసంతృప్తికి గురిచేశాయని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ చేసిన కామెంట్లు ప్రకంపనలు రేపుతున్నాయి. నిన్ననే టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఖండించిన సంగతి తెలిసిందే. ఇవాళ కాంగ్రెస్ నేతలు స్వరం అందుకున్నారు. సీఎం కేసీఆర్ తీరును తప్పుపట్టారు. వీరికి మాజీ గవర్నర్, బీజేపీ నేత విద్యాసాగర్ రావు కూడా జతకలిశారు.
ఆచరించకపోగా.. విమర్శలు...
కరోనావైరస్ గురించి గవర్నర్ సూచనలు చేస్తే వాటిని ఆచరించకపోవడం ఏంటీ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పైగా ఆ పార్టీ నేతలు కొందరు గవర్నర్పై విమర్శలు చేయడం సరికాదన్నారు. వైరస్ ప్రబలుతోన్న క్రమంలో వైద్యశాఖలో పోస్టులు భర్తీ చేయాలని, ఆస్పత్రుల్లో బెడ్స్ పెంచాలని గవర్నర్ లేఖల్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు.
ప్రతిపక్షాలు, మీడియా.. ఇప్పుడు గవర్నర్..
ప్రతిపక్షాలు, మీడియాపై కాక గవర్నర్పై కూడా కామెంట్స్ సరికాదని భట్టి అన్నారు. రాజ్యాంగబద్ద పదవీలో ఉన్నవారిని కూడా విమర్శించి రాజకీయ విలువలను టీఆర్ఎస్ పార్టీ బేఖాతర్ చేస్తోందని మండిపడ్డారు. ఒక ప్రభుత్వంపై గవర్నర్ కామెంట్స్ చేస్తే విలువలు ఉన్న ముఖ్యమంత్రులు ఇదివరకు రాజీనామా చేశారని బట్టి గుర్తుచేశారు. ఈ విషయాన్ని గవర్నర్ ఇక్కడితో వదిలేయొద్దని ఆయన కోరారు. గవర్నర్కు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం
గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతున్నాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చిన్న రాష్ట్రాలు కూడా రోజుకు లక్షల్లో టెస్టులు చేస్తున్నాయని ఉత్తమ్ గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ తీరుతో రాష్ట్రం అభాసుపాలవుతోందని ఉత్తమ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు.
గవర్నర్ సూచన కరెక్టే..
గవర్నర్ తమిళసై వ్యాఖ్యలను మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగరరావు సమర్థించారు. వైద్యురాలిగా కరోనాపై గవర్నర్ ప్రభుత్వానికి సూచనలు చేశారని తెలిపారు. వైరస్ నివారించాలంటే చికిత్సను వికేంద్రీకరణ చేయాలన్నారు. కరోనా చికిత్స అంటే గాంధీ ఆసుపత్రి ఒక్కటే కాదన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గల ఆసుపత్రుల్లో కరోనా చికిత్స చేయాలని కోరారు.