టీడీపీకి వద్దు, నాకు కాకుండా ఎవరికి టిక్కెట్ ఇచ్చిన ఓడిస్తా: శేరిలింగంపల్లిపై భిక్షపతి
హైదరాబాద్: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ మధ్య శేరిలింగంపల్లి సీటు చిచ్చు పెట్టింది. టీడీపీలోను ఈ సీటు కోసం కొట్లాట జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆశావహులు కూడా శేరిలింగంపల్లి కాంగ్రెస్కే రావాలని డిమాండ్ చేస్తున్నారు.
గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ నేత భిక్షపతి అనుచరుడు ఆత్మహత్యాయత్నం చేశారు. కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. అతనిని పోలీసులు అడ్డుకున్నారు. మరో అనుచరుడు చేయి కోసుకున్నాడు. శేరిలింగంపల్లి టిక్కెట్ కాంగ్రెస్కే కేటాయించాలని భిక్షపతి అనుచరులు డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే భిక్షపతి గాంధీ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. పొత్తులో భాగంగా టీడీపీకి త్యాగం చేసేందుకు మనకు బీసీ సీటు కావాల్సి వచ్చిందా అని ప్రశ్నించారు. బీసీల సీటును టీడీపీ ఎందుకు అడుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.శేరిలింగంపల్లి టిక్కెట్ మనకు రావాల్సిందే అన్నారు. దీనిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీలు పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీలో వర్గపోరు: ఆనంద్ ప్రసాద్పై చెప్పులతో దాడి, ట్రాఫిక్ జాం
పొత్తులో భాగంగా టీడీపీకి అసలే కేటాయించవద్దని, శేరిలింగంపల్లి టిక్కెట్ తనకు కాకుండా మరెవరికి ఇచ్చినా ఓడిస్తానని భిక్షపతి హెచ్చరించారు. దాదాపు వంద మంది కార్యకర్తలతో ఆయన గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగారు.
అంతకుముందు, టీడీపీలోను శేరిలింగంపల్లి టిక్కెట్ పైన వర్గపోరు కనిపించింది. ఒక నేత ప్రచారాన్ని ఇంకో నేత అనుచరులు అడ్డుకుంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి భవ్య అనంద ప్రసాద్, మొవ్వ సత్యనారాయణలు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరు నేతల మధ్య వర్గపోరు తీవ్రమవుతోంది.
భవ్య ఆనంద్ ప్రసాద్ మద్దతుదారులు ఆదివారం భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. మొవ్య అనుచరులు బైక్ ర్యాలీని అడ్డుకుంటూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన అనంద ప్రసాద్ ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. మొవ్య సత్యనారాయణ మాత్రం టీఆర్ఎస్లో చేరారు. మళ్లీ టీడీపీలోకి వచ్చి టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. దీంతో అంతర్గత పోరు ఏర్పడింది.