పాలమూరు రైతులపై కేసీఆర్ చిన్న చూపు..! భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలన్న కాంగ్రెస్..!
నాగర్ కర్నూలు/హైదరాబాద్ : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన వట్టెం రిజర్వాయర్ భూనిర్వాసితులు చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. ప్రభుత్వం తమకు న్యాయమైన పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేసారు. అంతే కాకుండా వారు చేపట్టిన ఆందోళన మంగళవారానికి 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి గులాబీ పార్టీ తిరును తప్పు బట్టారు. 15రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పాలమూరు రైతుల పట్ల సీఎం చంద్రశేఖర్ రావుకు చిత్త శుద్ది ఉంటే వెంటేనే దీక్షా శిభిరానికి రావాలని చిన్నా రెడ్డి డిమాండ్ చేసారు.
సిద్దిపేటలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు ప్రభుత్వం ఏవిధమైన పరిహారం ఇచ్చిందో.. అదేమొత్తంలో పాలమూరు-రంగారెడ్డి భూ నిర్వాసితులకు కూడా పరిహారం చెల్లించాలని టీపిసిసి డిమాండ్ చేస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇదే చివరి హెచ్చరిక అని, వెంటనే భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోతే.. అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసి ఉద్యమిస్తామని అన్నారు.
సీఎం చంద్రశేఖర్ రావు సొంత జిల్లా పైన అమితమైన ప్రేమను చూపుతూ.. పాలమూరు జిల్లా రైతన్నలపై సవతి తల్లి ప్రేమ ఎలా చూపిస్తారని చిన్నారెడ్డి మండిపడ్డారు. నిరసన తెలుపుతున్న రైతుల పరిస్థితి చేజారకముందే ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారం పట్ల ప్రకటన చేయాలని డిమాండ్ చేసారు.