పుట్టిన రోజు కానుకగా ఇంటికి రూ.కిలో ఉల్లిగడ్డ పంచిన కాంగ్రెస్ నేత
వరంగల్: ఉల్లిగడ్డ ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో ఉల్లిగడ్డ ధర పెరుగుదల పైన సామాజిక వేదికల్లో వివిధ రకాల వ్యంగ్యాస్త్రాలు మనకు కనిపిస్తున్నాయి. ఉల్లి ధర పెరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రైతు బజార్లలో కిలో ఉల్లిగడ్డను రూ.20కి ఇచ్చే ఏర్పాట్లు చేశాయి.
అయితే, వాటికి పరిమితి విధించింది. ఎందుకంటే ధరలు భారీగా పెరగడంతో ఎన్ని ఉల్లిగడ్డలు అయితే అన్ని ఉల్లిగడ్డలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆధార్ కార్డు చూపిస్తే ఒకరికి రెండు కిలోలు చొప్పున అంటూ ఇస్తున్నారు. ఉల్లిగడ్డను బంగారంతోను పోలిక పెట్టి సెటైర్లు వేస్తున్నారు.
కొద్ది రోజులుగా.. ఉల్లి విషయంలో వినూత్న బహుమతులు, ఆఫర్లు తెరపైకి వచ్చాయి. తమ సైట్ ద్వారా సరుకులు కొంటే రూపాయికే కిలో ఉల్లి ఇస్తామని ఇటీవల బెంగళూరుకు చెందిన ఆన్లైన్ షాపింగ్ సైట్ వినూత్న ఆఫరిచ్చింది.
తాజాగా, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి ఇనుగాల వెంకట్రాం రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా పేదలకు వినూత్న బహుమతి ఇచ్చారు. పేదలకు కిలో ఉల్లిపాయలు ఉచితంగా పంచారు. పేదలకు కిలో ఉల్లి చొప్పున బహుమతి ఇచ్చారు.
గీసుకొండ మండలంలోని ఈ వినూత్న బహుమతులకు తెర తీశారు. తన జన్మదినం సందర్భంగా మండలంలోని ధర్మారం గ్రామంలో వంద మందికి కిలో ఉల్లి చొప్పున ప్రత్యేక ప్యాకెట్లను వెంకట్రాం రెడ్డి అందజేశారు. కాంగ్రెస్ యూత్ లీడర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్మారంలో వీటిని పంపిణీ చేశారు.