'కబాలి'లా టీఆర్ఎస్ ఫ్లాప్ షో.. ఎర్రబెల్లి అంత మాటంటే గుర్తులేదా?: గండ్ర వెంకటరమణ
ఒకప్పుడు టీఆర్ఎస్కు మగతనం లేదన్న ఎర్రబెల్లిని ఇప్పుడు పార్టీలో ఎలా చేర్చుకున్నావు అని గండ్ర నిలదీశారు.
హైదరాబాద్: వరంగల్ లో నిర్వహించిన టీఆర్ఎస్ 'ప్రజా నివేదన' సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ శ్రేణులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తన మార్క్ డైలాగ్ అయిన సన్నాసులు, దద్దమ్మలు లాంటి వ్యాఖ్యలతో కాంగ్రెస్ నాయకులను ఆయన విమర్శించారు.
కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల నుంచి అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్ జరుగుతోంది. తాజాగా దీనిపై స్పందించిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. వరంగల్ లో టీఆర్ఎస్ నిర్వహించిన సభ.. హీరో రజనీకాంత్ కబాలి సినిమాలా ప్లాఫ్ అయిందని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ సభలో కనీసం అమరవీరులను కూడా స్మరించుకోలేదని వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామిలపై కేసీఆర్ సభలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తీవ్ర అభద్రతా భావంలో ఉందన్నారు.
ఇక టీఆర్ఎస్ లోకి జంప్ అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు గురించి ప్రస్తావిస్తూ.. ఒకప్పుడు టీఆర్ఎస్ కు మగతనం లేదన్న ఆయనను ఇప్పుడు పార్టీలో ఎలా చేర్చుకున్నావు అని గండ్ర నిలదీశారు. కాంగ్రెస్ నేతలను చవటలు దద్దమ్మలు అనే ముందు.. కాంగ్రెస్ వల్లే నీ కుటుంబం పదవులు అనుభవిస్తున్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ద్రోహులకు పదవులు కట్టబెట్టి మాపైనే విమర్శలు చేస్తావా? అని ఫైర్ అయ్యారు.