సిటీలో గన్ఫైర్: కాంగ్రెస్ నేత యాదగిరిపై కాల్పులు, నిందితులు గుర్తింపు
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బోయినపల్లిలో శనివారం ఉదయం కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత యాదగిరిపై గుర్తు తెలియని దుండగులు బైక్పై కాల్పులు జరిపారు. బోయినపల్లిలోని మల్లికార్జున నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు యాదగిరిపై 6 రౌండ్లు కాల్పులు జరిపారు.
దుండగులు యాదగిరిపై కాల్పులు జరిపి తుపాకీని అక్కడే వదిలిపెట్టి రెప్పపాటులో అక్కడి నుంచి పరారయ్యారు. దుండగుల కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన యాదగిరి కాల్పుల గాయాలతోనే ఓల్డ్బోయిన్పల్లి పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు యాదగిరిని తొలుత సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడి నుంచి సన్షైన్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న యాదగిరికి ప్రాణపాయం లేదని డీసీపీ సుమతి మీడియాకు వివరించారు. యాదగిరి వైద్యులు సర్జరీ చేసినట్లుగా తెలిపారు. కాల్పుల సమయంలో పెనుగులాట జరిగిందని తెలిపారు.
దుండగులను బెంబేలిత్తించిన యాదగిరి
బైక్ వచ్చిన ఇద్దరు దుండగులు తనపై దాడికి దిగగా, యాదగిరి ఏమాత్రం అదిరిపోలేదు. దుండగుల తుపాకీ నుంచి దూసుకువచ్చిన ఓ బుల్లెట్ ఛాతీలోకి వెళ్లగా, మరో బుల్లెట్ తొడ భాగంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో రక్తమోడుతున్న స్థితిలోనే ఆయన దుండగులపైకి లంఘించి వారి చేతిలోని తుపాకీని లాగేసుకున్నాడు.
యాదగిరి ధైర్యంతో బెంబేలెత్తిపోయిన దుండగులు అక్కడి నుంచి పరారు కాగా... వారి చేతిలోని తుపాకీని యాదగిరి పోలీసులకు అప్పగించాడు. యాదగిరి శరీరంలో బుల్లెట్లు లేవని చికిత్సను అందించిన వైద్యులు తెలిపారు. మెడ, తల భాగంలో గాయలు మాత్రమే అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
సీసీటీవీ పుటేజిలో నమోదు
ఈ ఘటన మొత్తం మల్లికార్జున నగర్ లో వీధిలోని ఓ సీసీటీవీ పుటేజిలో నమోదైంది. దీంతో పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీలను పరిశీలించి కాల్పులు జరిపిన నిందితులను గుర్తించారు. అయితే ఈ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించి శభాష్ అనిపించుకున్నారు. ఈ కాల్పులు జరిపింది ఎవరనే దానిపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
భూ వివాదమే ఈ గొడవకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. యాదగిరిపై కాల్పులు జరిపింది హస్మత్నగర్కు చెందిన డొక్కల బాబు, రాజుగా పోలీసులు గుర్తించారు. సంఘటానా స్థలంలో సీసీ టీవీ ఫూటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు.
ఘటనా స్థలాన్ని సందర్శించిన హైదరాబాద్ సీపీ మహేంద్రరెడ్డి
ఘటనా స్థలాన్ని హైదరాబాద్ సీపీ మహేంద్రరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కాంగ్రెస్ నేత యాదగిరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. యాదగిరి శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి కాల్పులు జరిపారని సీపీ మహేందర్రెడ్డి తెలిపారు.
భూవివాదమే ఈ కాల్పులకు దారి తీసిందనే అనుమానం
ఘటనా స్థలంలో రెండు తూపాకులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అల్వాల్ ప్రాంతంలో ఓ భూవివాదమే ఈ కాల్పులకు దారి తీసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నయీం హతమైన తర్వాత పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్న క్రమంలో ఈ కాల్పుల కలకలం రేగడం పలు అనుమానాలకు తావిస్తోంది. నగరంలో రెండు రోజుల వ్యవధిలో రెండు చోట్ల కాల్పులు కలకలం రేగింది. శుక్రవారం రాత్రి మచ్చ బొల్లారంలో కూడా కాల్పులు జరిగినట్లు సమాచారం.