వైఎస్ షర్మిలకు జగన్ అన్యాయం? -కొత్త పార్టీతో ప్రతీకారమంటూ సంచలనం -ఏపీలోనే పెట్టాలన్న వీహెచ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా, ఆయన పేరుతో వైసీపీని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రస్తుతం ఏపీకి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే, అక్రమాస్తులకు సంబంధించిన కేసుల్లో జగన్ గతంలో జైలులో ఉన్న సమయంలో ఆయన సోదరి వైఎస్ షర్మిల పాదయాత్రలతో జనంలోకి వెళ్లడం తెలిసిందే. కాగా, ఇప్పుడు సోదరుడు జగన్ తో షర్మిలకు పడటంలేదని, ప్రతీకారంగానే ఆమె కొత్త పార్టీ పెడుతున్నారని ఓ ప్రాంతీయ పత్రిక సంచలన కథనాన్ని రాసింది. దీనిపై రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు..
Recommended Video
నిమ్మగడ్డ ఎక్కడ? భయంతో రాత్రికి రాత్రే ప్రైవేటు వాహనంలో -సుప్రీం తీర్పును బట్టి మెరుపు సమ్మె
షర్మిలకు జగన్ అన్యాయం చేశారంటూ..
వైఎస్ జగన్ కుటుంబీకులే యజమానులుగా తెలుగునాట 'సాక్షి' మీడియా కొనసాగుతుండటం, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు అనుకూలురంటూ 'ఈనాడు', 'ఆంధ్రజ్యోతి' పత్రికలపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తుండటం కొన్నాళ్లుగా కామన్ వ్యవహారం అయింది. సీఎం జగన్ సైతం గతంలో స్వయంగా ఆ రెండు పత్రికలు, ఒక టీవీ చానెల్ అంటూ మీడియా సంస్థల పేర్లు పెట్టి విమర్శలు చేశారు. ఈక్రమంలో ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ(ఆర్కే) ఆదివారం నాటి తన 'కొత్త పలుకు' కాలమ్ లో సంచలన కథనం రాశారు. షర్మిలకు జగన్ తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని, అన్నపై ప్రతీకారం తీర్చుకోవాలని చెల్లెలు రగిలిపోతోందంటూ కథనంలో పేర్కొన్నారు. అంతేకాదు..
రాజన్న రాజ్యం రుచిచూపేందుకే..
ఏపీలో జగన్ సర్కారు రాజన్న రాజ్యం దిశగా అడుగులు వేయడం లేదని, ఈ విషయంలో షర్మిల అన్నను నిలదీశారని, కొన్నాళ్లుగా వాళ్లిద్దరికీ మాటలు లేవని ఆర్కే తన కథనంలో రాశారు. అన్న చేతిలో అన్యాయానికి గురైన చెల్లెలు.. అసలు రాజన్న రాజ్యం ఎలా ఉంటుందో తెలంగాణలో కొత్త పార్టీ ద్వారా చూపించాలని భావిస్తున్నారని, తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో వచ్చే నెలలోనే కొత్త పార్టీ ప్రారంభించబోతున్నారని, వైఎస్ వారసత్వం తనదేననే వాదను షర్మిల వినిపించబోతున్నారని, ఈ విషయాలను ఆమె తన సన్నిహితుల వద్ద ప్రస్తావించారని కథనంలో పేర్కొన్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టబోతున్నారన్న వార్త పాతదే అయినప్పటికీ, ఆ పనిని జగన్ వ్యూహాత్మకంగా చేస్తున్నారని గతంలో వార్తలు రాగా, ఇప్పుడు ఆర్కే మాత్రం.. జగన్ తో విభేదాల వల్లే షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై..
జగన్కు ఆయుధాలిచ్చిన నిమ్మగడ్డ -ఆ వ్యాఖ్యలతో ఎస్ఈసీ ఇరుక్కుపోయారా? -సుప్రీంకోర్టులో వ్యూహం ఇదే!
ఏపీలోనే షర్మిల పార్టీ పెట్టాలి..
పత్రికలో కథనాలపై తెలంగాణ కాంగ్రెస్ నేత వీ.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వారసుడిగా తాను మాత్రమే ఉండాలని జగన్ భావిస్తున్నారని, అయితే, షర్మిలలో ప్రవహిస్తున్నది కూడా వైఎస్ రక్తమే కాబట్టి ఆమె కూడా పట్టుదలతో వ్యవహరిస్తుండొచ్చని వీహెచ్ అన్నారు. ''షర్మిలకు విశాఖ టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశాడు. ఒకవేళ షర్మిల కొత్త పార్టీ పెట్టాలనుకుంటే దానికి తెలంగాణ కంటే ఏపీనే సరైన వేదిక. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడం ద్వారా కొన్ని ఓట్లు చీల్చొచ్చు. కానీ దాని వల్ల ఆమెకు ఉపయోగం ఉండదు. ఏపీలోనైతే కచ్చితంగా ప్రయోజనాలు ఉంటాయి. అయినా, తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, కాంగ్రెస్ నేతలు బలంగా ఉన్నారు. కొత్తగా బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ దశలో జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే షర్మిల ఏపీలోనే పార్టీ పెట్టాలి. అప్పుడు జగన్ వ్యతిరేకులు ఆమె వెంట వస్తారు'' అని వీహెచ్ అన్నారు. షర్మిల కొత్త పార్టీపై ఇప్పటిదాకా మీడియాలో ప్రచారమే తప్ప అధికారిక ప్రకటనేదీ రాలేదు. ఆర్కే తాజా ఆరోపణలపై వైసీపీ నేతలు, వైఎస్ కుటుంబం స్పందించాల్సిఉంది.