టిఆర్ఎస్ వారి హస్తం: ఎస్సై రమేష్ మృతిపై బలరాం సంచలనం, జిల్లా ఎస్పీకి షాక్-ఉద్రిక్తత
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేష్ ఆత్మహత్య కేసు విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బలరాం నాయక్ శుక్రవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సై రమేష్ను ఉరి తీసి చంపేశారని ఆయన ఆరోపించారు.
పోస్టుమార్టం నివేదిక దారుణమన్నారు. ఎస్సై రమేష్ హత్య వెనుక స్థానిక టిఆర్ఎస్ నేతల హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి ఈ హత్య విషయాన్ని సీరియస్గా తీసుకొని సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సిబిఐ విచారణ జరపకుంటే తెలంగాణ గిరిజనులతో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కాగా, ఎస్సై రమేశ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికపై బలరాం నాయక్ భగ్గుమన్నారు.
ఎస్సై రమేష్ అంత్యక్రియల్లో ఉద్రిక్తత
ఎస్సై రమేష్ అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని కుటుంబ సభ్యులు, బంధువులు పట్టుబట్టారు. రమేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నేపథ్యంలో సిబిఐతో దర్యాఫ్తు చేయించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అంత్యక్రియలకు హాజరైన జిల్లా ఎస్పీని అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది.
జిహెచ్ఎంసీ ఓట్ల తొలగింపుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి
జిహెచ్ఎంసీ పరిధిలో అధికార టిఆర్ఎస్ అన్యాయంగా ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని టిపిసిసి ఆధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జిహెచ్ఎంసి పరిధిలో 17 లక్షల ఓట్లు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇది అప్రజాస్వామికం అని మండిపడ్డారు.
సనత్ నగర్ ప్రాంతంలోనే లక్షా 31 వేల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓట్ల తొలగింపుకు మార్క్ చేశారన్నారు. దీనిపై తాము సీఈసీకి, కోర్టుకు తీసుకెళ్తామన్నారు. వార్డుల విభజన, రిజర్వేషన్లలో అవకతవకలు జరిగాయన్నారు.