ఆర్నెళ్ల ఇంటి అద్దె, ఈఎంఐ చెల్లించండి, సీఎం కేసీఆర్కు జగ్గారెడ్డి లేఖ, లేదంటే దీక్ష..
కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ కొనసాగడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆరు నెలల కిరాయి ప్రభుత్వమే చెల్లించాలని, వారి ఈఎంఐ కూడా కట్టాలని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు జగ్గారెడ్డి లేఖ రాశారు. తన లేఖపై ఈ నెల 8వ తేదీలోపు సీఎం నుంచి స్పందన వస్తుందని.. లేదంటే 9వ తేదీన దీక్ష చేస్తానని తెలిపారు.
ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నాయని.. కావాలని లేవు చెబుతున్నాయని పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.25 వేల కోట్లు ఎలా కేటాయించారు అని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు నగదు కేటాయిస్తారు.. కానీ ప్రజల ప్రయోజనాలు పట్టవా అని నిలదీశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 2 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్.. ప్రజల కోసం మరో లక్ష కోట్లు ఎందుకు అప్పు చేయడం లేదన్నారు. అప్పు చేయకున్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు సాయం చేయమని అడగడం లేదని కొశ్చన్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని.. అందుకే మోడీపై కేసీఆర్ నోరు మెదపడం లేదు అని జగ్గారెడ్డి ఆరోపించారు.
Recommended Video
గ్రామాలతోపాటు పట్టణాల్లో ఇంటిపన్నును ఏడాది మాఫీ చేయాలని కోరారు. విద్యుత్ చార్జీ కూడా రద్దు చేయాలని.. ప్రజలను బిల్లు కట్టాలని ఒత్తిడి చేయొద్దని కోరారు. హైదరాబాద్లో రూ.30 వేల లోపు, ఇతరచోట్ల 15 వేల లోపు ఇంటి కిరాయి ప్రభుత్వమే 6 నెలలు చెల్లించాలని కోరారు. అలాగే వారి ఈఎంఐ కూడా ఆరు నెలలు ప్రభుత్వం చెల్లించాలని కోరారు. నీటి బిల్లులను రద్దు చేయాలని.. కంపెనీల కరంట్ బిల్లు కూడా మాఫీ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.