కేసీఆర్ పై దొంగనోట్లు, దొంగ పాస్ పోర్టు కేసులున్నాయ్.. కేటీఆర్ ఓ బ్రోకర్: కోమటిరెడ్డి ఫైర్
హైదరాబాద్: సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ దోపిడీ దొంగలంటూ సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వీరిద్దరికీ అధికారం పోతుందనే భయం పట్టుకుందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవితలు తెలంగాణ వచ్చినప్పటి నుంచి రూ. 10 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
మిషన్ భగీరథ, పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చి, కేసీఆర్, కేటీఆర్, కవిత 10 శాతం కమీషన్లు తీసుకున్నారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 500 కోట్లతో పూర్తయ్యే ఫైబర్ కేబుల్ వైరుకు కేటీఆర్ బావమరిది పేరుతో కాంట్రాక్టు ఇప్పించి, రూ. 5 వేల కోట్లను దోచుకున్నారని ఆయన ఆరోపించారు.
అంతేకాదు, మియాపూర్, జీడిమెట్ల భూ కుంభకోణాలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆధారాలతో సహా బయటపెడతామని కోమటిరెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి అధికారం పోగానే... కేసీఆర్, కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమని చెప్పారు. మోడీ, రాహుల్ గాంధీలను కేసీఆర్ నోటికొచ్చినట్టు దూషిస్తుంటే... కేటీఆర్ ఏమో జానారెడ్డిని విమర్శిస్తున్నారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పై గతంలో నకిలీ నోట్ల కేసు, దొంగ పాస్ పోర్టుల కేసులున్నాయని... బ్లాక్ టికెట్లను అమ్ముకున్న చరిత్ర ఆయనదని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వారిపైనా, వారు సంపాదించిన ఆస్తులపై విచారణ జరిపిస్తామని, ఈడీ చేత కేసులు పెట్టిస్తామని ఆయన హెచ్చరించారు.