కాంగ్రెస్ నేత కొండా కి ఊరట..! బెయిల్ మంజూరు చేసిన కోర్ట్..!!
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు కోర్ట్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం 25,000 రూపాయల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. పోలీసుల విచారణకు సహరించాలని ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డికి సూచించింది. అలాగే ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయరాదని బంజారాహిల్స్ పోలీసులకు స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొండా అనుచరుడు సందీప్ 10 లక్షల రూపాయలతో పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే..!
ఈ వ్యవహారంలో నోటీసులు అందించేందుకు కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇంటికి వెళ్లగా, ఆయన తన అనుచరులతో తమను నిర్బంధించారని ఎస్సై కృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వరరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనకు అరెస్ట్ వారెంట్ నోటీసులు ఇచ్చారు. దీంతో కొండా ముందస్తు బెయిల్ కోరుతూ స్థానిక కోర్టును ఆశ్రయించారు. తొలుత కొండా విశ్వేశ్వరరెడ్డి ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ ను కోర్టు కొట్టివేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కొండా కి ఊరట లభించినట్టైంది.