కేసీఆర్ మగాడైతే: కాంగ్రెస్ నేతల ముప్పేట దాడి, 'టీఆర్ఎస్ పతనం మొదలైనట్టే'
హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు సన్నాసులంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో మాటల యుద్ధానికి తెరదీశాయి. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మధుయాష్కి గురువారం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ రాబందుల పార్టీ అని, టీఆర్ఎస్ నేతలంతా చదువురాని మూర్ఖులని విమర్శించారు.
కేసీఆర్ సవాల్ చేసి పారిపోవడం కాదని, మగాడైతే నిలబడాలాని ఆయన వ్యాఖ్యానించారు. కేసులు పెట్టి చిప్పకూడు తినిపిస్తామన్న కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ సోయి వుండి మాట్లాడుతున్నారా? తాగి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు.
మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాన్ని దగా ఒప్పందంగా అభివర్ణించిన మధుయాష్కి మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్ ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, కేసులు పెడతారా? అంటూ మధుయాష్కి ధైర్యం ఉంటే సీబీఐతో విచారణ చేయించండని సవాల్ విసిరారు.
జైళ్లకు పోవడం కాంగ్రెస్కు కొత్తేమీ కాదు: వీహెచ్
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతురావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే జైల్లో పెట్టి జైలు కూడు తినిపిస్తానని కేసీఆర్ అనడం దారుణమని అన్నారు. మమ్మల్ని జైల్లో పెట్టిన రోజే టీఆర్ఎస్ పతనం మొదలైనట్టేనని వీహెచ్ హెచ్చరించారు. ప్రాణహిత - చేవేళ్ల జాతీయ ప్రాజెక్టు కోసం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. జైళ్లకు పోవడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదని చెప్పిన వీహెచ్ మూడు వేల ఎకరాలు మునగకుండా చేసుకున్న ఒప్పందానికి మహారాష్ట్ర సంబురాలు చేసుకోవాలని అన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలకు భద్రత కుదింపుపై తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రత కుదింపుపై ఇంటిలిజెన్స్ అధికారులకు ఆయన గురువారం లేఖ రాశారు.
కేసీఆర్ అనాలోచిత నిర్ణయం: జీవన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తాకట్టు పెట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆరోపిం��ారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలను నిందించినంత మాత్రాన వాస్తవాలు కనుమరుగు కావని అన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణం కేసీఆర్ అనాలోచిత నిర్ణయమని ఆయన మండిపడ్డారు. వాస్తవాలను సీఎం వక్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు.
కుటుంబ ప్రయోజనాల కోసం: భట్టి విక్రమార్క
సీఎం కేసీఆర్ తన కుటుంబ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజలపై రూ. 80వేల కోట్ల భారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర సీఎం బంధువుల భూములు కాపాడేందుకే తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల ఎత్తు తగ్గించుకొని వచ్చిన కేసీఆర్ ఏం సాధించారని సంబరాలు చేసుకున్నారో చెప్పాలన్నారు. జలయజ్ఞంలో కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని, ఆధారాలు లేకుండా మాట్లాడిన కేసీఆర్ జైల్లో పెట్టాలని అన్నారు.
తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉంది: అఖిలపక్ష రాజకీయ నేతలు
సాగునీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందం తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉందని అఖిలపక్ష రాజకీయ నేతలు ఆక్షేపించారు. ఈ వ్యవహారంపై వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతామని సాక్ష్యాతూ సీఎం బెదిరించడం సరికాదని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ హితవు పలికారు.