ఎంఐఎం, బీజేపీని తరిమికొట్టండి: భట్టి, టీడీపీ ముచ్చట తీరుస్తా: మంత్రి తలసాని
హైదరాబాద్: ఎంఐఎం, బీజేపీ రెండు పార్టీలు హైదరాబాద్లో సామరస్య వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని, కుట్రలు పన్నుతున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంఐఎం, బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన మండిపడ్డారు.
ఎంఐఎం, బీజేపీ పార్టీలను తరిమికొట్టాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. హైదరాబాద్కు గ్లోబల్ ఇమేజీని తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. హైదరాబాద్కు ఉన్న గ్లోబల్ ఇమేజీని బీజేపీ, ఎంఐఎం పార్టీలు పాడు చేస్తున్నాయన్నారు. సీమాంధ్రులను కేసీఆర్ ఓటింగ్ యంత్రాల్లా చూస్తున్నారని మండిపడ్డారు.
రాజకీయ అవసరాల కోసం లబ్ధి పొందాలనే ఆలోచనతోనే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు. అంతేకాదు ఓట్ల కోసం ఎంఐఎం, బీజేపీ వాటి మిత్ర పక్షాలు హైదరాబాదు ప్రజల వద్దకు వచ్చి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ రెండు పార్టీల కోసం ఓటువేస్తే సామరస్యానికే ముప్పే వస్తుందన్నారు.
పాలన నుంచి ఈ రెండు పార్టీలను దూరం పెట్టాలని సూచించారు. మతతత్వపార్టీలు ప్రజలను సమానంగా చూడలేవని, ఆయా మతాల వ్యక్తుల కోసం పాటుపడతాయని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రజలను కబలించి రాజకీయ ఒత్తిళ్లకు పాల్పడుతోందన్నారు.
కాబట్టి గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాదు ప్రజలు మతాల ప్రాతిపదికగా ఓట్లు వేయవద్దని, సుపరిపాలన లక్ష్యంగా ఓటర్లు ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సామరస్యపూర్వక వాతావరణాన్ని బీజీపీ, ఎంఐఎం పార్టీలు పాడుచేస్తున్నాయన్నారు.
హైదరాబాద్ నగరానికి గోదావరి నీళ్ల కలను సాకారం చేసింది టీఆర్ఎస్ పార్టీ అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బుధవారం ఉదయం ఓ టెలివిజన్ చానల్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 15 సీట్లు గెలిస్తే, తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మరోసారి మంత్రి తలసాని ప్రకటించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధిపై వాదోపవాదాలు జరగ్గా మంత్రి తలసాని సవాల్ విసిరాడు. నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్ అభివృద్ధిని తామే చేశామని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు గొప్పలు చెప్పుకుంటున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ గ్రేటర్ పీఠం టీఆర్ఎస్ పార్టీదేనన్నారు. నగరంలోని 22 లక్షల కుటుంబాలకు చెత్త డబ్బాలు ఇచ్చామన్నారు. చెత్త సేకరణకు 2500 వాహనాలు మంజూరు చేశామన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కాగా, తమ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి, రాజీనామా చేయకుండా టీఆర్ఎస్లో తలసాని కొనసాగుతున్నాడని, తక్షణం ఆయన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తెలుగుదేశం చాలా నెలలుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.