కూల్చాలనే నీ ఆలోచన: 'గ్రేటర్ ఎన్నికల్లో ఏముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావ్'
హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి మణిహారంగా తయారయ్యే మెట్రో రైలు అలైన్మెంట్ను మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూశాడని తెలంగాణ పీసీసీ ఉపనేత మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. శనివారం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో అసలు టీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ నగరం ఇక్కడ నివసిస్తున్న అందరిదని, అందిరిని కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీయేనన్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఐఐసీటీ, ఐఎస్బీ, టాటా ఏరోస్పేస్, బయోలాజికల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్ధలకు హైదరాబాద్కు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు.
హైదరాబాద్ ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు. ఇంత మంది ప్రజానీకం ఇక్కడికి వచ్చి నివసించేలా అందిరికీ అన్ని ఏర్పాట్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. అసలు హైదరాబాద్కు టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని సూటిగా ప్రశ్నించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావ్ అంటూ విమర్శించారు. మేము ఎంతో కష్టపడి నిర్మించిన హైదరాబాద్ మహానగరంలోని భూములను అమ్ముకోవాలని ఆలోచన చేశారని మండిపడ్డారు. సచివాలయాన్ని కూల్చాలని, ఉస్మానియా క్యాంపస్లోని భూములను ఆక్రమించాలని చూశారన్నారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నీ ఆలోచన హైదరాబాద్ను కూల్చాలనే ఉందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ ప్రజల సమస్యలను టీఆర్ఎస్ ఎప్పుడైనా పరిష్కరించిందా? అని అన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన నువ్వు, నగరమంతా హోర్డింగ్లు పెట్టుకుంటే ప్రజలు ఎట్లు వేస్తారని అనుకంటున్నావా? అని ఎద్దేవా చేశారు.