ఆసక్తికరం: రాజాసింగ్ కార్యాలయానికి కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్, ఎందుకంటే?
హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఏ పార్టీ అభ్యర్థి అయినా ఇంటింటికి వెళ్లి ఓటు అడగడం సహజం. కొన్ని సందర్భాలలో రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లు లేదా దుకాణాలు కనిపిస్తాయి. అక్కడకు కూడా వెళ్లి ఓటు వేయాలని అడుగుతుంటారు. ఇలాంటి ఆసక్తికర పరిణామమే హైదరాబాదులోని గోషామహల్ నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకుంది.
టీడీపీకి గట్టి షాక్: పొత్తుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు, చంద్రబాబు ఆశలపై నీళ్లు?
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (ఇంకా ప్రకటించలేదు) ముఖేష్ గౌడ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ లోధ్ గోషామహల్ కార్యాలయానికి వెళ్లారు. తనకు ఓటు వేయాలని ఆయనను అభ్యర్థించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పుడు వీరు ప్రత్యర్థులు!
రాజాసింగ్ లోధ్ 2014లో బీజేపీ తరఫున గోషామహల్ నుంచి పోటీ చేసి గెలిచారు. అంతకుముందు ముఖేష్ గౌడ్ ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. ముఖేష్ గౌడ్ మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం వీరిద్దరు ప్రత్యర్థులు. వీరు కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
సీటుపై ధీమాగా ముఖేష్ గౌడ్
మహాకూటమి పొత్తులో భాగంగా గోషామహల్ నియోజకవర్గం సీటు తనకు దక్కుతుందని ముఖేష్ గౌడ్ ధీమాగా ఉన్నారు. కూటమిలో కాంగ్రెస్ పార్టీకి 95 సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమకు సీటు దక్కుతుందని భావిస్తున్న నేతలు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ముఖేష్ గౌడ్ కూడా కూటమిలో భాగంగా తనకు టిక్కెట్ వస్తుందని విశ్వాసంతో ఉన్నారు. దీంతో ఆయన ప్రచారంలో మునిగిపోయారు.
ఇంటింటికి తిరుగుతూ బీజేపీ కార్యాలయానికి
ప్రచారంలో భాగంగా ముఖేష్ గౌడ్ గోషామహల్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ తనకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున రాజాసింగ్ లోధ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ముఖేష్ ప్రచారం చేస్తుండగా సమీపంలో బీజేపీ కార్యాలయం కూడా ఉంది. ముఖేష్ బీజేపీ కార్యాలయంలోకి వెళ్లి రాజాసింగ్ను కలిశారు. తనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. వారిద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. చేయి కలిపారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. పరస్పరం ఆప్యాయంగా నవ్వుతూ పలకరించుకున్నారు.
2014లో ముఖేష్పై రాజాసింగ్ గెలుపు
2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన రాజాసింగ్ ఇదే ముఖేష్ గౌడ్ పైన దాదాపు 47వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాలుగో స్థానంలో ఉంది. గోషామహల్ నియోజకవర్గంలో ఉత్తరాది వారి ప్రభావం ఎక్కువ. గత ఎన్నికల్లో రాజాసింగ్ గెలుపుకు అది కూడా కారణమని చెబుతారు.