ముఖం చెక్కి, మర్మాంగం కోసి కాంగ్రెసు నేత దారుణ హత్య
కరీంనగర్: తెలగాణలోని కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో దారుణ హత్య జరిగింది. హత్యకు గురైన వ్యక్తి కాంగ్రెసు రాష్ట్ర నాయకుడు కావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ముఖం చెక్కేసి, మర్మాంగం కోసి ఆయనను దుండగులు హత్య చేశారు. ఇప్పటి వరకు గుర్తు తెలియని మృతదేహమేనని అంతా అనుకున్నారు.
అయితే, ఆ గుర్తు తెలియని శవం కాంగ్రెస్ నేత దార వీరాస్వామిదనే విషయం తెలియడంతో సర్వత్రా ఆశ్చర్యం చోటు చేసుకుంది. గోదావరిఖని శివాజీనగర్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దార వీరాస్వామి (57) మార్కండేయ కాలనీ సమీపంలోని దుర్గా నగర్లో హత్యకు గురైన విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది.
గోదావరిఖని పోలీసుల వివరాల ప్రకారం... దార వీరాస్వామి భార్య రాధాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం జనగామ ప్రాంతానికి చెందిన ఓ భూ వివాదం కేసులో కొద్ది రోజులుగా చాప కింద నీరులా జరుగుతున్న వ్యవహారం ఈ హత్యకు దారి తీసిన్నట్లు ప్రచారం జరుగుతోంది.
భూ వివాదాల వ్యవహారంతో జరిగిన హత్యగా ప్రచారం జరుగుతున్నప్పటికీ మర్మాంగం కోసి ఉండడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. గోదావరిఖని సబ్ డివిజన్ ఎఎస్పీ విష్ణు ఎస్ వారియర్, సి ఐ ఆరె వెంకటేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకొని ఈ విషయమై పూర్తి స్థాయిలో వివరాలను ఆరా తీస్తున్నారు.