పోతిరెడ్డి పాడు వివాదం.. కేసీఆర్-జగన్ చీకటి ఒప్పందాలు... కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చీకటి ఒప్పందాలు చేసుకున్నారని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. జగన్తో ఒప్పందం వల్లే తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు కమిటీ పేరును కృష్ణ నది జలాల పరిరక్షణ కాంగ్రెస్ కమిటీగా మారుస్తున్నామని... త్వరలోనే అన్ని గ్రామాలు తిరిగి కేసీఆర్ లోపాయకారి ఒప్పందాలను బయటపెడుతామని అన్నారు.
కేసీఆర్, జగన్లు సమావేశం అయ్యాక కూడా జగన్ సంగమేశ్వర్ ప్రాజెక్టుకు జీఓ ఇచ్చారని, ఏపీ 170 టీఎంసీల నీరు దోచుకుందని ఆరోపించారు. నెల్లూరులో రెండు పంటలు పండించుకున్నారని, మూడో పంటకు సిద్ధం అవుతున్నారని అన్నారు. కృష్ణా నుంచి పెన్నా బేసిన్కు ఏపీ ప్రభుత్వం నీటిని తరలిస్తోందని.. కృష్ణాలో మనకు 69 శాతం వాటా ఉందని నాగం గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు అన్యాయమే జరుగుతోందన్నారు.
Recommended Video
సీఎం కేసీఆర్కు నదీ జలాలపై ఏమాత్రం అవగాహన లేదన్నారు.జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులు, డిస్టిబ్యూటరీ కెనాల్స్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కృష్ణా నికర జలాలను తెలంగాణ ఎందుకు వాడుకోవడం లేదని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణకు భారీగా నష్టం జరుగుతుందన్నారు.