బాలకృష్ణకు చిక్కులు: 'ఏపీ ఎమ్మెల్యే.. హైదరాబాద్లో ఓటేలా వేస్తారు'
హైదరాబాద్: నవ్యాంధ్ర ప్రదేశ్లోని హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కరీంనగర్ జిల్లా మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ శుక్రవారం నాడు డిమాండ్ చేశారు.
ఈ నెల 2వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో బాలకృష్ణ ఓటు వేశారని, హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన జిహెచ్ఎంసిలో ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ రాశానని, ఆయన సభ్యత్వం రద్దు చేయాలని ఆ లేఖలో కోరానని చెప్పారు.
సాధారణంగా ఏ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉంటే ఆ రాష్ట్రంలోని శాసన సభకు పోటీ చేయవచ్చు. ఒక రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలో ఓటు హక్కును కలిగి ఉండాలి. అలాంటి నిబంధన ఉన్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎలా ఓటు వేస్తారని పొన్నం ప్రశ్నించారు.
ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం చెల్లుబాటు కాదని, అందువల్ల ఆయనను తక్షణం ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని ఈసికి లేఖ రాసినట్లు చెప్పారు. ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం లోకసభకు పోటీ చేసేందుకు దేశంలోని ఏ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉన్నా సరిపోతుందని, కానీ అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలో ఓటు హక్కు ఉండాలన్నారు.
అలాగే ఒక జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే సంబంధిత జిల్లాలో ఓటరు అయి ఉండాలని, ఎన్నికల నిబంధనలు ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ బాలకృష్ణ మరో రాష్ట్రంలో ఓటు వేయడం చట్ట వ్యతిరేక చర్య అన్నారు. తక్షణం అతనిని అనర్హుడిగా ప్రకటించాలన్నారు.
అక్బర్ బిన్ లాడెన్లా: విహెచ్
కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానని అక్బరుద్దీన్ ఓవైసీ బిన్ లాడెన్లా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపి వి హనుమంత రావు గురువారం మండిపడ్డారు. పాతబస్తీ గురించి మంత్రి కెటి రామారావుకు తెలియదని, మజ్లిస్కు సహకరించడమంటే పాముకు పాలుపోసినట్లే అన్నారు.
పాతబస్తీలో మజ్లిస్ నేతలు దాదాగిరీ చేస్తున్నారన్నారు. అక్బరుద్దీన్ పైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జానా, ఉత్తమ్, షబ్బీర్కు ఇక్కడి సంగతులు తెలియవని, తమతో కూడా మాట్లాడాలని వి హనుమంత రావు అన్నారు.