ఆర్టీసీ సమ్మెపై బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ నేత పొన్నం..బీజేపీ ప్రేక్షక పాత్ర వహిస్తే ఎలా?
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ బిజెపి ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చొరవ తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన అన్నారు. 21 రోజుల నుండి సమ్మె కొనసాగుతున్నా రాష్ట్ర బిజెపి ఎందుకు మౌనంగా ఉందంటూ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం వట్టి ఓదార్పు వ్యాఖ్యలతో కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మీ ఉద్యమానికి మేము మద్దతు ఇస్తామంటే చాలదని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కచ్చితంగా జోక్యం చేసుకునేలా రాష్ట్ర బిజెపి ఒత్తిడి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. 21 రోజులుగా ప్రజా జీవనం స్తంభించి పోతున్నా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కు కనిపించటం లేదా అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కార్మికుల జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారని, బిజెపి ప్రేక్షకపాత్ర వహించడం మంచిది కాదు అని పొన్నం ప్రభాకర్ హితవుపలికారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం కావాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి కేంద్రం వైపునుండి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో రాష్ట్ర బిజెపి తెలపాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసి చాలా రోజులైంది అని, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో తెలియ లేదన్న పొన్నం ప్రభాకర్, కేంద్రం నుండి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో బిజెపి నేతలు చెప్పాలన్నారు.
ఇక తాజాగా సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రమైన వ్యాఖ్యలు గా పరిగణించి రాష్ట్ర బిజెపి కేంద్రంతో మాట్లాడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సమ్మెపై జోక్యం చేసుకునేలా రాష్ట్ర బిజెపి కృషి చేయాలన్నారు. బీజేపీ నిరంకుశ విధానాలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసి ఆర్టీసీ కార్మిక వర్గానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉట్టి మాటలతో కాకుండా చేతలతో రాష్ట్ర బీజేపీ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. అలా కాకుంటే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి, టిఆర్ఎస్ రెండూ మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీలేనని ప్రజలు అనుకునే పరిస్థితి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.