కేసీఆర్! నేనొస్తున్నా, పబ్బులు, డ్రగ్స్.. అంతా కేటీఆర్ బావమరిదే: రేవంత్ సంచలనం
తాను రంగంలోకి దిగుతున్నానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని ఆయన సీఎం కేసీఆర్కు హెచ్చరికలు జారీ చేశార
హైదరాబాద్: తాను రంగంలోకి దిగుతున్నానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని ఆయన సీఎం కేసీఆర్కు హెచ్చరికలు జారీ చేశారు.
డ్రగ్స్ సరఫరాదారులు కేసీఆర్ కుటుంబ దగ్గరి వ్యక్తులు
డ్రగ్స్ సరఫరాదారులు కేసీఆర్ కుటుంబానికి దగ్గర వ్యక్తులేనని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. డ్రగ్స్ కేసు విచారణ తీరును చూసి మొదట మధ్య తరగతి ప్రజలు సంతోషపడ్డారని, కానీ విచారణ తర్వాత చర్యలు మాత్రం శూన్యం అన్నారు.
కేటీఆర్ బావమరిదికి ఇచ్చారు
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక డ్రగ్స్, పబ్స్ పెరిగాయని రేవంత్ మండిపడ్డారు. ప్రస్తుతం 59 పబ్లు హైదరాబాద్లో నిర్వహిస్తున్నారన్నారు. కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్కు చెందిన ఈవెంట్స్ నౌ అనే సంస్థకు హైటెక్స్, గచ్చిబౌలి మైదానాలను సన్బర్న్ పార్టీల నిర్వహణ కోసం సర్కారు ఇచ్చిందన్నారు.
డ్రగ్స్ పార్టీలకు మాత్ర అనుమతులు
పబ్బులు, మ్యూజికల్ నైట్స్ డ్రగ్స్కు అడ్డాగా మారుతున్నాయని రేవంత్ అన్నారు. ఎవరి ఒత్తిళ్లతో వాటికి అనుమతులు వస్తున్నాయని ప్రశ్నించారు. తెలంగాణలో కొలువుల కొట్లాటకు అనుమతి రాదు కానీ, మాదక ద్రవ్యాలు వినియోగించే పార్టీలకు అనుమతి ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
సన్ బర్న్ పార్టీలకు అనుమతులు ఎలా
సన్ బర్న్ పార్టీలకు అనుమతులు ఎందుకిస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. ధర్నాలు, ఆందోళనలకు మాత్రం నో చెబుతున్నారన్నారు. 24న సన్ బర్న్ పార్టీకి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పార్టీలకు కేటీఆర్ బావమరిది సంస్థనే టిక్కెట్లు అమ్ముతోందన్నారు.