బురిడీ బాబా, కేసీఆర్ ఫ్యామిలీకి చరమగీతమే: రేవంత్ నిప్పులు, ‘రెడ్డి రాకతో కాంగ్రెస్కు బలం’
కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పి అప్పుల కుప్పగా మార్చారని నిప్పులు చెరిగారు.
మంగళవారం మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మహేంద్రహిల్స్లోని ఆయన నివాసం వద్ద మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
బురిడీ బాబాలా..
ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాయమాటలతో తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ బురిడీ బాబాలా తయారయ్యారని ఎద్దేవా చేశారు.
అభివృద్ధి ఎక్కడ?
ఇప్పటికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 40 నెలలు గడిచినా తెలంగాణలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు. మరో 15 నెలల్లో ఏమి సాధించగలుగుతారని ఆయన ప్రశ్నించారు. ఎందరో త్యాగమూర్తుల ప్రతిఫలంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహాయ సహకారాలతో తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందని రేవంత్ చెప్పుకొచ్చారు.
కేసీఆర్ ఫ్యామిలీ పాలనకు చరమగీతం
2019 ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబపాలనకు చరమగీతం పలికితీరుతామని రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి కేసీఆర్ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
రేవంత్ రాకతో బలం పెరిగింది..
ఈ సందర్భంగా సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలమైన పార్టీగా మారిందన్నారు. కేసీఆర్ దళిత వ్యతిరేకిగా మారాడని ఆరోపించారు. మాలమహానాడు వ్యతిరేకిగా సీఎం కేసీఆర్ మారాడని అన్నారు.