ఇది దారుణం, అమానవీయం.. మీరే మాట తప్పితే ఎలా?: కేసీఆర్కు రేవంత్ లేఖ
హైదరాబాద్: ఏళ్లకు ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదించి.. విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి లేఖ రాశారు.
గతంలో పెట్టిన షరతులు కాలపరిమితులతో లేకుండా ఉద్యమ సమయంలో ఖైదీలకు మీరిచ్చిన హామీ మేరకు.. ఐదేళ్లు శిక్ష పూర్తిచేసుకున్న మహిళా ఖైదీలకు.. ఏడేళ్లు వాస్తవ శిక్షను మూడేళ్ల రిమిషన్ శిక్షతో కలిపి పదేళ్ల శిక్షను పూర్తిచేసిన పురుష ఖైదీలందరినీ విడుదల చేయాలని అభ్యర్థించారు.
రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి.. అంటూ రేవంత్ రెడ్డి రాసిన లేఖలో రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఖైదీలను విడుదల చేయడానికి అవసరమైన జీవోను విడుదల చేయాలని కోరారు.
గాంధీగారు కూడా ఐదేళ్ల శిక్ష చాలన్నారు...
ప్రాయశ్చిత్తానికి మించిన శిక్షలేదని మన వేదాలు, ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయని, ఆవేశంలోనో, ఆగ్రహంతోనో తప్పు చేసి, కొన్ని సందర్భాల్లో తాము తప్పు చేయకపోయినా తప్పు చేసిన వారికి బంధువులో, స్నేహితులో అయిన పాపానికి నాలుగు గోడల మధ్య నలిగిపోయే వారు అనుక్షణం మానసిక క్షోభను అనుభవిస్తూనే ఉంటారని రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. అలాంటి వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు అంతకుమించిన మానసిక క్షోభను అనుభవిస్తుంటారని, అందుకే యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఖైదీకైనా ఐదేళ్లు శిక్ష విధిస్తే సరిపోతుందని సాక్షాత్తు మహాత్మాగాంధీ కూడా చెప్పారని తెలిపారు.
మీరిచ్చిన హామీయే.. ఏమైంది?
జీవితం విలువ తెలియాలంటే యావజ్జీవ శిక్ష పడిన ఖైదీలను అడిగి తెలుసుకోవాలని కూడా మహాత్మాగాంధీ చెప్పేవారని, అందుకే వారికి మేలు చేసే మాట ఎవరిచ్చినా అది ఎప్పుడు నెరవేరుతుందా అని కళ్లలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తుంటారని రేవంత్ రెడ్డి తన లేఖలో రాశారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, గత ఎన్నికల సందర్భంగానూ ఐదేళ్లు శిక్ష పూర్తి చేసిన ఖైదీలను విడుదల చేస్తామని మీరు కూడా పలు సందర్భాలలో హామీ ఇచ్చారు. అయితే రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లవుతున్నా ఖైదీలకు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోలేకపోయారు.. అటు ఖైదీలు, ఇటు వారి రాకకోసం ఎదురుచూస్తున్న వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు..' అని రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి పేర్కొన్నారు.
మీ తొలి క్షమాభిక్ష తీరు ఇదీ...
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఐదేళ్ల శిక్షా కాలం పూర్తి చేసుకున్న ఖైదీలందరినీ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రసాదించిన క్షమాభిక్ష వందలమంది ఖైదీలను నిరాశ పరిచింది. మీరు గతంలో ఇచ్చిన మాటకు భిన్నంగా ఐదేళ్లు శిక్ష పూర్తి చేసిన వారిని కాకుండా 12 నుంచి 14 సంవత్సరాల వాస్తవ శిక్ష, కనీసం ఆరేళ్ల రిమిషన్ శిక్షతో కలిపి కనీసం 18 నుంచి 20 సంవత్సరాల శిక్షా కాలాన్ని పూర్తి చేసిన వారికి మాత్రేమే క్షమాభిక్ష పెట్టి విడుదల చేశారు..' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
దారుణం.. అమానవీయం...
ఈ కాలపరిమితి కారణంగా వందలాది ఖైదీలు విడుదలకు నోచుకోలేదని, దీంతో శిక్ష అనుభవిస్తున్న తమ వారు విడుదలవుతారని ఆశగా ఎదురుచూస్తున్న వందలాది కుటుంబాలకు నిరాశే మిగిలిందని రేవంత్ రెడ్డి తన లేఖలో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మరో సందర్భంలోనైనా మీరు మీ మాటను నిలబెట్టుకుంటారని ఖైదీలు, వారి కుటుంబీకులు ఆశగా ఎదురుచూస్తున్నా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో గాంధీ జయంతులు, రిపబ్లిక్ డేలు వెళ్లిపోతున్నా మీరు మాత్రం ఖైదీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, ఇది చాలా దారుణం, అమానవీయం కూడా అని సీఎం కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
కాల పరిమితులతో సంబంధం లేకుండా...
‘ఈ నేపథ్యంలోనే రాబోయే రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఖైదీలను విడుదల చేయడానికి అవసరమైన జీవోను విడుదల చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. అయితే గతంలో పెట్టిన షరతులు కాలపరిమితులతో కాకుండా ఉద్యమ సమయంలో ఖైదీలకు మీరు ఇచ్చిన హామీ మేరకు.. మహిళా ఖైదీల్లో ఐదేళ్లు శిక్షను పూర్తిచేసిన వారిని, అలాగే పురుష ఖైదీలలో ఏడేళ్లు వాస్తవ శిక్షను మూడేళ్ల రిమిషన్ శిక్షతో కలిపి పదేళ్ల శిక్షను పూర్తిచేసిన వారందరినీ విడుదల చేయడానికి జీవోను జారీ చేయాల్సిందిగా కోరుతున్నాను..' అని రేవంత్ రెడ్డి తన లేఖలో తెలిపారు. అంతేకాదు, ఖైదీల విడుదలకు సంబంధించి గత ప్రభుత్వాలు ఇచ్చిన జీవో నంబర్లు, తేదీలను కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా మాట నిలుపుకొని క్షమాభిక్ష పెట్టి ఖైదీలకు స్వేచ్ఛా వాయువులను ప్రసాదించాలని తమరిని కోరుతున్నాను.. అంటూ రేవంత్ రెడ్డి తన లేఖను ముగించారు.