జైపాల్ రెడ్డి..శక్తిమంతమైన మాటకారి: ఆయన భార్యకు సోనియా గాంధీ లేఖ!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి మృతి పట్ల ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆమె జైపాల్ రెడ్డి భార్య లక్షికి లేఖ రాశారు. జైపాల్రెడ్డి మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. ఎలాంటి లాభాన్ని ఆశించకుండా పార్టీని ముందుకు నడిపించారని అన్నారు. ఎలాంటి పదవులను జైపాల్ రెడ్డి కోరుకోలేదని, పదవులే ఆయనను వరించాయని అన్నారు.
పార్టీకి పురోగమించడానికి నిస్వార్ధంతో సేవ చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత విశ్వసనీయులైన నేతల్లో జైపాల్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని సోనియా గాంధీ అన్నారు. ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన అయిదుసార్లు పార్లమెంట్కు ఎంపిక అయ్యారని, ప్రాధాన్యత గల మంత్రివర్గ శాఖల్లో పనిచేశారని గుర్తు చేసుకున్నారు. జైపాల్ రెడ్డి శక్తిమంతమైన మాటకారిగా అభివర్ణించారు. పార్టీ అభిప్రాయాలు, సిద్ధాంతాలను చొరవగా జనంలోకి తీసుకెళ్లగలిగారని అన్నారు. విశ్వసనీయమైన సహచరుడని, గౌరవించుకోదగ్గ నాయకుడని చెప్పారు. జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో తన ప్రగాఢ సానుభూతిని సోనియాగాంధీ వ్యక్తం చేశారు.
UPA Chairperson and Congress leader Sonia Gandhi has written a condolence letter to Lakshmi - wife of senior leader and former union minister #JaipalReddy who passed away in Hyderabad today. pic.twitter.com/TGcFyPZd1n
— ANI (@ANI) July 28, 2019