వంటేరు చాలా ఓపెన్ గురూ.. టీఆర్ఎస్లో ఎందుకు చేరుతున్నాడో దాచుకోకుండా చెప్పేశారు
హైదరాబాద్/గజ్వెల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గజ్వెల్ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆయన తెరాస తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా తెరాసలో తాను చేరడానికి గల కారణాలను వంటేరు తన అనుచరులకు వివరించారు. కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు లేదని, అందుకే తనలాంటి మంచి లీడర్లు తమ దారి తాము చూసుకుంటున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో అంటూ ఓ టీవీ ఛానల్ ఇచ్చింది. ఈ వీడియోలో వంటేరు ఏం చెప్పారంటే...
రేవంత్ రెడ్డికి ఊహించని షాక్: టీఆర్ఎస్లోకి కేసీఆర్పై పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి?
నాపై 40 కేసులు ఉన్నాయి
సిస్టం కరెక్టుగా లేదని, పరిస్థితులు బాగాలేవని, కాబట్టి నన్ను తీసుకోవాల్సి వస్తోందని, ఇప్పుడు ఏం అనేటట్టు ఉన్నాం, ఏమి అనేటట్టులేని పరిస్థితి అని అని వంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పినట్లుగా ఉంది. తనపై 40 కేసులు ఉన్నాయని, ఓ పది కేసులు కొట్టివేశారని, మొత్తం యాభై కేసులు ఉండెనని చెప్పారు. ఇన్ని కేసులు తెలంగాణలో ఎవరి పైన అయినా ఉన్నాయా అన్నారు. తెలంగాణలో యాభై కేసులు ఎవరి పైన అయిన ఉన్నాయా అన్నారు.
గజ్వెల్లో నేను చూసుకుంటా, కానీ టీమ్ లీడర్ లేరు
ఫ్యూచర్ అంటే.. (భవిష్యత్తు గురించి మాట్లాడుతూ) ఫైట్ చేద్దామని వంటేరు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో వంద కోట్లు ఖర్చుపెట్టేవాళ్లు లేరని చెప్పారు. తాను పార్టీని చక్కబెట్టుకోవాలంటే లేదా నా నియోజకవర్గంలో ఏం జరిగినా నేనే పెట్టుకుంటానని, ఏది ఉన్నా నేను చూసుకుంటానని, కానీ టీమ్ లీడర్ (కాంగ్రెస్ పార్టీకి) మాత్రం లేరని చెప్పారు.
అసలు మనం ఏం చేశాం
నిరుద్యోగుల కోసం ఏం చేశామని వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. మాదిగలకు మూడెకరాల పొలం ఇస్తామని చెప్పారని, దానిపై ఎంత వరకు ఉద్యమాలు చేశామని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై ఎంత వరకు చేశామని (ప్రశ్నించడం), రైతు ఆత్మహత్యలపై ఎంత వరకు వెళ్లామని (పోరాటం చేయలేదనే ఉద్దేశ్యంలో) అన్నారు. తద్వారా గత కేసీఆర్ పాలనలో ఇచ్చిన హామీలు నెరవేరకపోయినప్పటికీ కాంగ్రెస్ సరైన ఉద్యమాలు చేయలేదని వంటేరు అభిప్రాయపడ్డారు.
చంద్రబాబుపై చెప్పులేశారు
తెలంగాణ ఉద్యమం సమయంలో చంద్రబాబు మీటింగ్ పెడితే చెప్పులేశారని, కోడిగుడ్లతో కొట్టారని, ఇప్పుడు ఆ స్పిరిట్ ఎందుకు లేదని అడుగుతున్నానని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ పైన ఉద్యమించానని, రేవంత్ రెడ్డిని (తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్) రెండు రోజులు కూర్చోబెట్టుకున్నానని, ఇరవై వేలమందితో ఉద్యమించానని, హారతులు పట్టించానని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.
నేను వంద ఫోన్లు చేస్తే, ఎవరైనా రూపాయి ఇచ్చారా
తాను ఐకేపీ వాళ్ల కోసం పైట్ చేశానని వంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పారు. మల్లన్న సాగర్ కోసం ఫైట్ చేశానని అన్నారు. రైతు ఆత్మహత్యలపై ఫైట్ చేశానని, చీఫ్ లిక్కర్ పైన కూడా ఫైట్ చేశానని అన్నారు. ఈ రాష్ట్రంలో తనలో ఎవరూ ఫైట్ చేయలేదని అభిప్రాయపడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలోను ఫైట్ చేశానని, హైదరాబాదులో ఉన్నవాళ్లకు తాను వంద ఫోన్లు చేశానని, యాంటీ కేసీఆర్కు ఎవరైనా రూపాయి ఇస్తారా, రోజంతా అక్కడ తిరిగి, రాత్రంతా పైసల (డబ్బులు) కోసం తిరిగానన్నారు.
ఇంకో పది ఎకరాలు అమ్ముకొని పెడతా
అనుకోకుండా ఎన్నికలు వచ్చాయని, ఇప్పుడు వస్తే కొంచెం ప్రిపేర్ అయ్యేవాళ్లమని వంటేరు చెప్పారు. ఏప్రిల్లో జరగాల్సిన ఎన్నికలను తీసుకెళ్లి దసరా పండుగకు పెడితే డబ్బులు ఎక్కడ ఉంటాయన్నారు. తనకు కోట్లుకావాలాయే అన్నారు. వీళ్లకు ఓ విజన్ (కాంగ్రెస్) లేదని, కనీసం ఫ్యూచర్ కూడా కనిపించడం లేదని, వెళ్లక వెళ్లక గాంధీ భవన్కు వెళ్లానని, వాళ్లు సీసాలతో కొట్టుకుంటున్నారని, మనం ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నామని, ఇంకో పది ఎకరాలు అమ్ముకొని పెడతామని, అయినా నేనే చేయాలే (మరెవరూ ఫైట్ కోసం ముందుకు రావడం లేదనే అభిప్రాయంతో) అన్నారు.
టీఆర్ఎస్ చల్తీకా నామ్ గాడీ
టీఆర్ఎస్ చల్తీకా నామ్ గాడీ అని వంటేరు అన్నారు. తమ పరిస్థితి ఎలా ఉందంటే.. మా వద్ద పవర్ లేదని, పదిహేనేళ్లుగా పని చేస్తున్నానని, ఎటూ అధికారంలోకి రామని అనుకుంటున్నారని, అందుకే మంచిలీడర్లం మా దారి మేం చూసుకుంటామని వెళ్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఓ మంచి లీడర్ గురించి ప్రస్తావించారు. అలాంటి వ్యక్తి టీఆర్ఎస్ కండువా వేసుకున్నారని చెప్పారు. ఊళ్లలో వ్యవస్థ అలా అయిపోయిందన్నారు.
అయినా ప్రజలు నాకు ఓటేశారు
పదిహేనేళ్లలో ఒక్కసారి పవర్ లేదని, అయినా మాకు ప్రజలు ఓట్లు వేస్తున్నారని వంటేరు చెప్పారు. ముఖ్యమంత్రి మీద తనకు 70వేల ఓట్లు వచ్చాయని చెప్పారు. అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చేవని, కానీ 2014లో చూపిన స్పిరిట్ ఇప్పుడు చూపలేదన్నారు.