విషాదం... ఎమ్మెల్యే బాజిరెడ్డి వియ్యంకుడు కరోనాతో మృతి...
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వియ్యంకుడు ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నేత వెంకటేశ్వర్లు కరోనాతో మృతి చెందారు. ఆయన మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇటీవల వైరస్ బారిన పడిన ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం(జూలై 22) అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.
ప్లాస్మా ట్రీట్మెంట్ అందించినప్పటికీ వెంకటేశ్వర్లు వైరస్ బారి నుంచి కోలుకోలేకపోయారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ఐఎన్టీయూసీ నేతగా సుదీర్ఘ కాలంగా ఆయన సేవలందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఆకుల లలితకు కూడా వెంకటేశ్వర్లు దగ్గరి బంధువు.
వెంకటేశ్వర్లు మృతి పట్ల కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు,పలువురు కార్మిక నాయకులు సంతాపం ప్రకటించారు. కాగా,ఎమ్మెల్యే బాజిరెడ్డి కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా కూడా కరోనా బారినపడ్డప్పటికీ తిరిగి కోలుకున్నారు.
నిజామాబాద్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం(జూలై 21) ఒక్కరోజే రికార్డు స్థాయిలో 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 50 కేసులు జిల్లా కేంద్రంలోనే నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పలువురు వ్యాపారులు స్వచ్చంద లాక్ డౌన్ పాటిస్తున్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రికి కేసుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం 103 మంది ఐసోలేషన్లో,40మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.