కేసీఆర్కు ఝలక్: నమ్మొద్దు కేటీఆర్ కోసమే.. ఇవాంకాకు కాంగ్రెస్ నేత లేఖ
హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు, శ్వేత సౌధం సలహాదారు ఇవాంకా ట్రంప్కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు శుక్రవారం లేఖ రాశారు. ఇటీవల ఇవాంకా హైదరాబాదులో రెండు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే.
ఇవాంకాతో వన్స్మోర్ అనిపించుకున్న చంద్రమోహన్ కూతురు, కోటను చూశాక ఏమన్నారంటే
ఇవాంకా రాక నేపథ్యంలో హైదరాబాదును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆమె వెళ్లే రహదారులు బాగు చేశారు. ఫ్లై ఓవర్, రోడ్డు పక్కన ఉన్న గోడలపై రంగులు అద్ది కనువిందుగా మార్చారు. ఈ నేపథ్యంలో విహెచ్ అధికార పార్టీకి షాకిస్తూ లేఖ రాశారు.
తెలంగాణలో కనిపించేవన్నీ వాస్తవాలు కాదు
తెలంగాణలో కనిపించేవన్నీ వాస్తవాలు అనుకోవద్దని వీ హనుమంత రావు.. ఇవాంకా ట్రంప్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేబినెట్లో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదని చెప్పారు.
కేటీఆర్ ప్రమోషన్ కోసం
హెచ్ఐసీసీలోని సదస్సు మహిళల కోసమో, వ్యాపారం కోసమో అన్నట్లుగా లేదని, కేవలం ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ప్రమోట్ చేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా ఉందని విహెచ్ ఎద్దేవా చేశారు.
ఎవరినీ గౌరవించరు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలను గౌరవించరని, అలాంటి ప్రభుత్వం కనీసం మేయర్కు కూడా సరైన గౌరవం ఇవ్వలేదని వి హనుమంత రావు తన లేఖలో పేర్కొన్నారు. కాగా, విహెచ్ ప్రభుత్వం తీరుపై ఇవాంకాకు లేఖ రాయడం గమనార్హం.
మేయర్ మనస్తాపం అని ప్రచారం
కాగా, మేయర్ బొంతు రామ్మోహన్కు మెట్రో రైలు, జీఈఎస్ సదస్సు సందర్భంగా సరైన గౌరవం లభించలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఆయన మనస్థాపం చెందినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా సాగింది. కానీ వీటిని ఆయన కొట్టి పారేశారు.