ఆస్తుల ఆన్లైన్లో భారీ అక్రమాలు - పేదలను దోచుకుంటున్నారు - కేసీఆర్పై విజయశాంతి ఫైర్
తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఆస్తుల ఆన్ లైన్ నమోదు, వాటి వివరాలను ధరణి పోర్టల్ లో నిక్షిప్తం చేసే ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతున్నదని, ఇదే అవకాశంగా పేద ప్రజలను దోచుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చీఫ్ విజయశాంతి విమర్శించారు. ఇంత జరుగుతున్నా సర్కారు ప్రజల బాధల్ని పట్టించుకోవడంలేదని, రాజకీయ వ్యూహాల్లో సీఎం కేసీఆర్ బిజీ అయిపోయారని ఎద్దేవా చేశారు.
ఆస్తుల నమోదు, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కాంగ్రెస్ నేత విజయశాంతి శుక్రవారం ట్విటర్ వేదికగా సర్కారుపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో ధరణి పేరిట ఆస్తుల ఆన్ లైన్ అంటూ ప్రారంభించిన నమోదు ప్రక్రియ అస్తవ్యస్తంగా కొనసాగుతోందని, ఆ విషయం ప్రచార మాధ్యమాలు కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నాయని, సాంకేతిక సమస్యలు ఒకవైపు, శిక్షణలేని సిబ్బందితో మరోవైపు.. చివరికి వేదన మాత్రం ప్రజలకు అంటూ ఆమె పేర్కొన్నారు.
ఇప్పటికిప్పుడు పన్నులు చెల్లిస్తేనే ఆస్తులు ఆన్ లైన్ చేస్తామన్న హెచ్చరికల నేపథ్యంలో ఎంతోకొంత ముట్టచెబితేనే కానీ వివరాలు నమోదు చేసుకోబోమని సర్వత్రా బెదింరింపుల పరంపర కొనసాగుతున్నదని, దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలను తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని విజయశాంతి అన్నారు.
ఇక కోవిడ్ విషయానికొస్తే.. గాంధీ ఆస్పత్రిలోనో... లేదా నిమ్స్ ఆస్పత్రిలోనో అనునిత్యం ఫ్రంట్ లైన్ వారియర్ల ధర్నాలు, నిరసనల పరంపర కొనసాగుతూనే ఉందని, ఇవి చాలక డబుల్ బెడ్రూం ఇళ్ళ పేరిట మంత్రులు ప్రజల్ని మభ్యపెడుతూనే ఉన్నారని, అటు చూస్తే ప్రయివేట్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల ఇబ్బంది పడుతున్నారని, రైతుల ఆవేదనకు అంతులేకుండా పోయిందని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు.
Recommended Video
మొత్తమ్మీద ఇవాళ రాష్ట్రంలో పాలకవర్గం తప్ప మరే వర్గమూ ప్రశాంతంగా లేదని, జనం బాధలు పడుతుంటే.. కేసీఆర్ దొర మాత్రం పరిపాలనను అటకెక్కించి, దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను గెలిపించుకునేందుకే దృష్టి సారించినట్టు కనిపిస్తోందని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని విజయశాంతి అన్నారు.