విక్రమ్ కాల్పుల కేసులో ట్విస్ట్: అదే జరిగిందా?.. ఎవరిదా నల్లకారు?
ఈ మేరకు విక్రమ్ గౌడ్, ఆయన భార్య షిఫాలీ చెప్పిన వివరాలన్ని కట్టుకథలని పోలీసులు నిర్దారణకు వచ్చినట్లు చెబుతున్నారు.
హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల వ్యవహారంలో ఇంకా పూర్తి మిస్టరీ వీడలేదు. అయితే విక్రమ్ గౌడ్ పై హత్యాయత్నం వట్టిదేనని, ఆయనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటాడన్న అభిప్రాయానికి పోలీసులు వచ్చినట్లు తెలుస్తోంది.
భయమా, పరువా: విక్రమ్ గౌడ్కు తెలుసు కానీ, మూడో వ్యక్తి ఎవరు?
ఈ మేరకు విక్రమ్ గౌడ్, ఆయన భార్య షిఫాలీ చెప్పిన వివరాలన్ని కట్టుకథలని పోలీసులు నిర్దారణకు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో విక్రమ్ గౌడ్ పైనే కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపేందుకు.. విక్రమ్ భార్య షిపాలీకి సీఆర్పీ సెక్షన్-41 కింద నోటీసులివ్వనున్నట్లు తెలుస్తోంది.
వీడియో అనాలసిస్ సెంటర్కు
ఇక విక్రమ్ గౌడ్ ఇంట్లో ఉన్న సీసీటీవి ఫుటేజీని పోలీసులు వీడియో అనాలసిస్ సెంటర్ కు పంపించారు. విక్రమ్ వాడిన రివాల్వర్ విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. ఆ ఆయుధం ఎక్కడినుంచి వచ్చింది?.. అసలది ఆయనదేనా?.. ఘటన తర్వాత ఎలా మిస్సయింది?.. వంటి ప్రశ్నలకు స్పష్టత లేకుండా పోయింది.
Recommended Video
ఆ ఆనవాళ్లేమి లేవు?:
ఎవరో అగంతకులు వచ్చి తనపై కాల్పులు జరిపారని విక్రమ్ చెబుతున్నప్పటికీ.. దానికి సంబంధించిన ఆనవాళ్లేవి లభించలేదు. ఘటనకు సంబంధించి సీన్ టూ సీన్ రీ-కన్ స్ట్రక్ట్ చేసిన పోలీసులు శాస్త్రీయ ఆధారాల ద్వారా విక్రమ్ ది ఆత్మహత్యేనని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
నల్లరంగు కారుపై ఆరా:
సీసీటీవి కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను బట్టి చూస్తే మాత్రం.. బయటి వ్యక్తులెవరూ ఇంట్లోకి రాలేదని పోలీసులు గమనించినట్లు సమాచారం. అయితే ఒక కెమెరాలో మాత్రం నల్లరంగు కారు ఇంటినుంచి వెళ్లినట్లు కనిపించిందని చెబుతున్నారు. అయితే ఆ కారుకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వీడియోను అనాలసిస్ సెంటర్ కు పంపించారు.
ప్రీ-ప్లాన్డ్ వ్యవహారమా?:
ఆత్మహత్యాయత్నం ప్రీ-ప్లాన్డ్ గా జరిగిందా?.. లేక బయట వ్యక్తుల పాత్ర కూడా ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, తాను అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు విక్రమ్ గౌడ్ పోలీసులు ఎదుట అంగీకరించాడు. ఒడిశాలో చేస్తున్న మైనింగ్ వ్యాపారంలో తనకు చాలా డబ్బులు రావాల్సి ఉందని పేర్కొన్నట్లు సమాచారం. విక్రమ్ కాల్పుల మిస్టరీ కేసులో సోమవారం రానున్న ఫోరెన్సిక్ రిపోర్టు కీలకంగా మారనుంది.